భూయాజమాన్య హక్కుల మార్పిడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ప్రక్రియను ఇవాళ్టి నుంచి ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో మ్యుటేషన్ సేవలను ప్రారంభించేందుకు అధికారికంగా కార్యాచరణ చేపట్టింది. రిజిస్ట్రేషన్ అయిన భూముల వివరాలను తక్షణమే రెవెన్యూ రికార్డుల్లో మార్పు జరిగేలా ఈ ప్రక్రియను అందుబాటులోకి తీసుకువచ్చారు. సీఎం జగన్ సచివాలయంలో దీనికి సంబంధించిన పోస్టరును విడుదల చేసి సేవలను ప్రారంభించారు. రైతులకు చెందిన క్రయ, విక్రయాల లావాదేవీలు, భూ వివరాలు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా నమోదు అవుతున్నప్పటికీ.. ఆ వివరాలు రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెవెన్యూ రికార్డుల్లో మార్పు చేర్పుల కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితిని తప్పించేందుకు ఆటో మ్యుటేషన్ను సర్కారు ప్రారంభించింది. దీని వల్ల అవినీతికి చెక్ పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ పూర్తైతే రెవెన్యూ శాఖకు వివరాలు
ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు, పట్టాదారు పుస్తకాల చట్టం 1971 సవరణ ద్వారా భూ బదలాయింపు వివరాలు రికార్డు చేయడం సహా రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన అధికారులను ప్రొవిజినల్ రికార్డింగ్ అధికారులుగా గుర్తించనున్నారు. వీరి నియామకాల బాధ్యతను పూర్తిగా సంబంధిత జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన వెంటనే రెవెన్యూ రికార్డుల ఆన్లైన్ భూమి బదలాయింపు కోసం ఎలాంటి రుసుమూ చెల్లించకుండా భూ రికార్డుల మార్పిడి నమూనా, ఆర్ఓఆర్, 1 బి అండగల్ వివరాలు ఆన్లైన్ ద్వారా రెవెన్యూ శాఖకు చేరుతాయని ప్రభుత్వం వెల్లడించింది. 'మీ భూమి' పోర్టల్ ద్వారా మార్పుచేర్పులు స్వయంగా చూసుకోవచ్చు.