ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 15, 2021, 4:16 PM IST

Updated : Sep 16, 2021, 4:56 AM IST

ETV Bharat / city

HC ON NREGA: 'సీఎస్‌.. హైకోర్టుకు వచ్చి వివరణ ఇవ్వండి'

ap high court
ap high court

16:14 September 15

ఉపాధిహామీ బిల్లుల పెండింగ్‌పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ

    గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఉపాధి పనులకు బకాయిలు చెల్లించకపోవడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఆదిత్యనాథ్‌దాస్‌ వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 24న హాజరై విజిలెన్స్‌ విచారణపై న్యాయస్థానం లేవనెత్తిన ప్రశ్నలకు వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. విజిలెన్స్‌ విచారణ వ్యవహారంలో అదనపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శిని ఆదేశించింది. బకాయిల చెల్లింపుల విషయంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ అధికారులు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. తప్పుడు సమాచారమిచ్చిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

   జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత ప్రభుత్వ హయాంలో చేసిన (మెటీరియల్‌ కాంపొనెంట్‌) పనులకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన సుమారు 500 వ్యాజ్యాలపై హైకోర్టు ఇటీవల విచారణ జరిపింది. రెండు వారాల్లో బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. బుధవారం జరిగిన విచారణలో పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి.. అఫిడవిట్‌ దాఖలు చేస్తూ పిటిషనర్లలో కొంతమందికి పూర్తిగా, మరికొందరికి 79 శాతం చెల్లించామని పేర్కొన్నారు. గతంలో నిర్వహించిన పనులపై విజిలెన్స్‌ విచారణ జరుగుతున్న నేపథ్యంలో 21 శాతం సొమ్ము చెల్లించకుండా ఆపామన్నారు. కేంద్రం నుంచి తదుపరి విడత నిధులు రాగానే బకాయిలు చెల్లిస్తామన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ న్యాయవాది (జీపీ) కిరణ్‌ కోర్టుకు తెలిపారు.

చెల్లింపుల్లో ఆలస్యం.. ఎత్తుగడలా కనిపిస్తోంది

జీపీ వాదనలపై న్యాయమూర్తి సందేహం వెలిబుచ్చారు. ‘2020 అక్టోబర్‌ 16న విజిలెన్స్‌ విచారణ పూర్తయినట్లు రాష్ట్ర ప్రభుత్వం తమకు సమాచారం ఇచ్చిందని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ అఫిడవిట్‌ దాఖలు చేసింది. కేంద్రం వాటాగా చెల్లించాల్సిన బకాయిలన్నీ రాష్ట్రానికి జమ చేసినట్లు అందులో పేర్కొంది. కేంద్రానికి 2020 అక్టోబర్‌లో విజిలెన్స్‌ విచారణ పూర్తయినట్లు సమాచారమిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో విచారణ జరుగుతోందని పేర్కొనడం కోర్టును తప్పుదోవ పట్టించడమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరోలా చెబుతున్నాయి. పంచాయతీరాజ్‌శాఖ అధికారులు కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు సీఎస్‌ హాజరై వివరణ ఇవ్వాలి’ అని పేర్కొన్నారు.

 చెల్లింపుల్లో జాప్యం చేయాలన్నదే పంచాయతీరాజ్‌శాఖ అధికారుల ఎత్తుగడగా కనిపిస్తోందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తమపై ఎలాంటి విచారణ జరగడం లేదని పిటిషనర్లు చెబుతుంటే.. 21 శాతం సొమ్మును ఎలా ఆపుతారని ప్రశ్నించారు. పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఇచ్చిన మెమో రాజ్యాంగంతో సమానమా? అని వ్యాఖ్యానించారు. కేంద్రం నిధుల్ని సక్రమంగా వినియోగించారా? లేదా తెలుసుకునేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖతో విచారణకు ఆదేశిస్తామని హెచ్చరించారు. ఏప్రిల్‌ నుంచి మే 27 మధ్య రూ.1,900 కోట్ల బకాయిలు చెల్లించామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం నమ్మేలా లేదన్నారు.


ఇదీ చదవండి: 

JAGAN BAIL: జగన్‌ బెయిల్‌ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరణ

Last Updated : Sep 16, 2021, 4:56 AM IST

ABOUT THE AUTHOR

...view details