ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భూములు కొంటే కుట్రకోణం ఎలా ఆపాదిస్తారు..?

అమరావతి చుట్టుపక్కల ప్రైవేటు వ్యక్తులు స్వచ్ఛందంగా విక్రయించిన భూములు కొనడం నేరం ఎలా అవుతుందని పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా హైకోర్టులో వాదించారు. భూములు కొన్న పిటిషనర్లకు కుట్ర కోణాన్ని ఏవిధంగా ఆపాదిస్తారని ప్రశ్నించారు. లావాదేవీలన్నీ చట్ట ప్రకారమే జరిగాయని... సీఐడీ కేసును రద్దు చేయాలని కోరారు. సీఐడీ తరఫున కూడా వాదనలు పూర్తవడంతో హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.

By

Published : Dec 23, 2020, 3:10 AM IST

ap high court
ap high court

రాజధాని ఎక్కడ ఏర్పాటవుతుందో ప్రభుత్వ పెద్దల ద్వారా తెలుసుకుని అమరావతి చుట్టుపక్కల భూములు కొనుగోలు చేశారంటూ కొందరు వ్యక్తులు, సంస్థలపై దాఖలైన కేసులో... మరోమారు వాదనలు జరిగాయి. ఈ కేసులో ఇప్పటికే వాదనలు పూర్తవగా... ముగ్గురు సెక్షన్ ఆఫీసర్ల వాంగ్మూలాల్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చేందుకు విచారణ తిరిగి ప్రారంభించాలంటూ పోలీసులు పిటిషన్‌ వేశారు. ఈమేరకు మంగళవారం విచారణ జరిగింది.

కేసును కొట్టివేయాలి...

ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగిన లావాదేవీలు చట్ట విరుద్ధం ఎలా అవుతాయని... పిటిషనర్ల తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదించారు. విక్రయదారుడికి లేని అభ్యంతరం ప్రభుత్వానికి ఎందుకని ప్రశ్నించారు. రాజధానిపై బహిరంగంగా లభ్యమైన సమాచారం మేరకే పిటిషనర్లు భూములు కొన్నారని స్పష్టం చేశారు. దీని వెనుక కుట్ర, ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటూ పోలీసులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కోర్టుకు నివేదించారు. మరికొందరు పిటిషనర్ల తరఫున న్యాయవాదులు కేఎస్.మూర్తి, ఏకె. కిశోర్‌రెడ్డి, ఎంవీ.సుబ్బారెడ్డి, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సీఐడీ ముందుగానే ఓ ఉద్దేశానికి వచ్చేసి, దర్యాప్తు ప్రక్రియను దుర్వినియోగం చేస్తోందన్నారు. సెక్షన్ ఆఫీసర్ల వాంగ్మూలాల్ని పరిగణించద్దని, కేసును కొట్టివేయాలని కోరారు.

ఎఫ్​ఐఆర్ రద్దు చేయవద్దు: ఏజీ

సీఐడీ తరఫున వాదించిన అడ్వొకేట్ జనరల్‌ ఎస్.శ్రీరామ్... రాజధాని నగర పరిధికి సంబంధించిన జీవోల తయారీలో నిబంధనలు పాటించలేదని వాదించారు. ముసాయిదా ప్రకటనలోనే లోపాలు ఉన్నాయన్నారు. సెక్షన్ ఆఫీసర్లకు తెలియకుండా ఉన్నతస్థాయి అధికారులు వ్యహరించారన్నారు. పెద్దస్థాయి వారినుంచి సమాచారం తెలుసుకుని పిటిషనర్లు భూములు కొనుగోలు చేశారని కోర్టుకు వివరించారు. దీని వెనుక కుట్రకోణం ఉందన్నారు. పిటిషనర్లపై నమోదుచేసిన ఎఫ్ఐఆర్ రద్దు చేయవద్దని, దర్యాప్తు కొనసాగనివ్వాలని కోరారు. రెండు వైపుల వాదనలు విన్న న్యాయస్థానం... తీర్పును రిజర్వ్‌ చేసింది.

ఇదీ చదవండి

నిర్లక్ష్యం వల్లే పరవాడ గ్యాస్ లీక్: ఎన్​జీటీ

ABOUT THE AUTHOR

...view details