MPs in Parliament: కొత్త విధానాన్ని బట్టే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ:కేంద్రం కొత్తగా రూపొందించిన ప్రభుత్వ రంగ సంస్థల విధానాన్ని అనుసరించే నాన్స్ట్రాటజిక్ విభాగంలో ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంటును పూర్తిగా ప్రైవేటీకరించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భాగవత్ కరాడ్ తెలిపారు. లోక్సభలో తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
భారీగా తగ్గిన కొత్త స్వయం సహాయక సంఘాలు:నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటయ్యే స్వయం సహాయకసంఘాల సంఖ్య భారీగా తగ్గిపోయింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 2వేల సంఘాల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకోగా 20,324 ఏర్పాటయ్యాయి. 2020-21లో 1,940 సంఘాల లక్ష్యం కాగా, 7,163 మొదలయ్యాయి. 2021-22లో 4,875 సంఘాలు ఏర్పాటుచేయాలని సంకల్పించగా, అంతిమంగా 5,149 మాత్రమే ఏర్పాటయ్యాయి. భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రపట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్సింగ్ ఈమేరకు బదులిచ్చారు.
రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహార బకాయి రూ.35,266 కోట్లు: దేశంలోని 31 రాష్ట్రాలకు జూన్ నాటికి జీఎస్టీ పరిహారం కింద ఇంకా రూ.35,266 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్చౌదరి తెలిపారు. ఆయన సోమవారం లోక్సభలో వైకాపా ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కు రూ.1,371 కోట్లు, తెలంగాణకు రూ.1,134 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఈ ఏడాది జూన్ తర్వాత కూడా రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించే కాలాన్ని పొడిగించాలని కొన్ని రాష్ట్రాలు కోరాయని, అయితే 101వ రాజ్యాంగ సవరణ చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం అయిదేళ్లవరకే రాష్ట్రాలకు పరిహారం చెల్లించే వెసులుబాటు ఉన్నట్లు గుర్తుచేశారు.
హైదరాబాద్-విజయవాడ రహదారి ఆరు వరుసల విస్తరణ పనులు వేగవంతం చేయాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. 377 నిబంధన కింద ఆ అంశాన్ని ఆయన లోక్సభ ముందుంచారు. 2022 ఏప్రిల్లో ప్రారంభమైన విస్తరణ పనులు 2024 ఏప్రిల్లో పూర్తికావల్సి ఉందని పేర్కొన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 13 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని రైలు, రోడ్డు అనుసంధానతను వేగవంతం చేయాల్సి ఉన్నా అలా చేయడం లేదని అన్నారు.
ఏపీ రెవెన్యూ లోటు రూ.4,117 కోట్లే:ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తొలి ఏడాది (2014-15)లో రాష్ట్రానికి ఏర్పడిన నికర రెవెన్యూ లోటు రూ.4,117 కోట్లేనని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. ఆ మొత్తాన్ని పూర్తిగా ఇప్పటికే చెల్లించామని తెలిపారు. సోమవారం లోక్సభలో చిత్తూరు ఎంపీ ఎన్.రెడ్డెప్ప అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 2014-15లో ఏపీకి రూ.22,949 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడిందనడం వాస్తవం కాదన్నారు.
పీఎం కేర్స్ కింద 220 మందికి ప్రవేశం:కొవిడ్ మహమ్మారి కాలంలో తల్లిదండ్రులిద్దరినీగానీ, ఒకరినిగానీ కోల్పోయిన 220 మంది చిన్నారులకు పీఎం కేర్స్ కింద కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశం కల్పించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్ చెప్పారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 13, తెలంగాణ నుంచి 10 మంది విద్యార్థులు ఉన్నట్లు వెల్లడించారు. అత్యధికంగా మధ్యప్రదేశ్లో 68 మందికి ప్రవేశం కల్పించామని తెలిపారు.
మూలధన వ్యయం రూ.1,189 కోట్లు విడుదల:మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పథకం ద్వారా ఏపీకి 2020-21లో రూ.688 కోట్లు, 2021-22లో రూ.501 కోట్లు కలిపి మొత్తం రూ.1,189 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. సోమవారం లోక్సభలో వైకాపా ఎంపీలు గోరంట్ల మాధవ్, పీవీ మిథున్రెడ్డి, బీవీ సత్యవతిలు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఇదే పద్దు కింద తెలంగాణకు రూ.572 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.