Amaravati Farmers Padayatra in Nellore : అమరావతి రైతుల మహాపాదయాత్రకు నెల్లూరు జిల్లా ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి అన్నదాతలకు మద్దతుగా నిలుస్తున్నారు. 32వ రోజు ముస్లిం, మైనార్టీలు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు. డేగపూడి వద్ద చంటిబిడ్డలను ఎత్తుకుని మహిళలు రైతులతో కలిసి అడుగు కలిపారు. ముస్లిం రథాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. కుల మతాలకు అతీతంగా తిరుపతి వరకు రైతులకు అండగా వెళ్తామని ప్రకటించారు.
అన్నదాతలపై పూలవర్షం...
డేగపూడి నుంచి వెంకటగిరి నియోజకవర్గం మలిచేడు వరకు ప్రజలు తమ వెంట తెచ్చుకున్న బ్యానర్లను పాదయాత్రలో ప్రదర్శించారు. ‘నాటి స్వాతంత్య్ర సమరయోధులకు అసలైన వారసులు నేటి అమరావతి రైతులు, ‘మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని ముద్దు’అంటూ బ్యానర్లను ప్రదర్శించారు. విద్యార్థులు, వృద్ధులు, మహిళలు ఎక్కడికక్కడ రైతులను ఆహ్వానించారు. అన్నదాతలపై పూలవర్షం కురిపించారు. కొబ్బరికాయలు కొట్టి దిష్టి తీశారు.
అడుగులోతు నీళ్లలో నడుస్తూ...
పొదలకూరు- రాపూరు మార్గంలో ఇనుకుర్తి వద్ద భారీవర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న రోడ్డులోనే రైతుల పాదయాత్ర కొనసాగింది. రోడ్డు మొత్తం కొట్టుకుపోయి అడుగులోతు నీళ్లు నిలవడంతో రైతులు నరకం చూశారు. స్వామివారి ప్రచార రథంతోపాటు కొంతమంది రైతులు అడుగులోతు నీళ్లలోనే నడుచుకుంటూ ముందుకు సాగారు. మరికొందరు బురదలో జారిపడి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో రోడ్లు బాగుచేయలేని జగన్ మూడు రాజధానులేమి కడతారని అన్నదాతలు మండిపడ్డారు.
నేడు తురిమెర్ల నుంచి పాదయాత్ర...
Amaravati Farmers Padayatra in Nellore : పాదయాత్రలో వివిధ సంఘాలు, పార్టీల నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో రైతులను ఇబ్బందిపెట్టిన ప్రజా ప్రతినిధులు ఇకపై జాగ్రత్తగా మసలుకోవాలని హెచ్చరించారు. అన్ని వర్గాల ఆకాంక్షల ప్రజల మది నుంచి వేరుచేయలేదని తేల్చి చెప్పారు. మహా పాదయాత్ర నేడు తురిమెర్ల నుంచి ప్రారంభమై సైదాపురం వరకు 10 కిలోమీటర్లు సాగనుందని అమరావతి ఐకాస స్పష్టం చేసింది. రైతులు రాత్రి అక్కడే బస చేస్తారని తెలిపింది.
ఇవీచదవండి.