తమిళనాడు BSP అధ్యక్షుడి దారుణ హత్య - దోషులను కఠినంగా శిక్షించాలన్న మాయావతి
Published : Jul 5, 2024, 8:59 PM IST
Tamilnadu BSP President Murder :బహుజన్ సమాజ్ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు కె.ఆర్మ్స్ట్రాంగ్ దారుణ హత్యకు గురయ్యారు. పెరంబూర్లోని తన ఇంటి సమీపంలో కొందరు పార్టీ కార్యకర్తలతో ఆర్మ్స్ట్రాంగ్ మాట్లాడుతుండగా, ఆరుగురు దుండగులు దాడి చేశారు. ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు పదునైన ఆయుధాలతో ఆర్మ్స్ట్రాంగ్ను నరికి చంపారు. తర్వాత వాటిపైనే పరారయ్యారు. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించినా, అప్పటికే ఆర్మ్స్ట్రాంగ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గతేడాది ఆర్కాట్ సురేష్ అనే గ్యాంగ్స్టర్ హత్యకు ఆర్మ్స్ట్రాంగ్కు సంబంధం ఉందని, కనుక ఇది ప్రతీకార హత్యే అయ్యుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనను మాజీ సీఎం పళనిస్వామి తీవ్రంగా ఖండించారు. స్టాలిన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని మండిపడ్డారు. హత్యపై స్పందించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆర్మ్స్ట్రాంగ్ను దళితుల బలమైన గొంతుగా అభివర్ణించారు. దోషులను కఠినంగా శిక్షించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.