By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 9, 2024, 8:57 PM IST
రాజధాని ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి: షర్మిల
YS Sharmila Comments on Tuni MLA: జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టేశారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఒకటి కాదు, 3 రాజధానులు కావాలని సీఎం జగన్ అన్నారని, ఇప్పుడు రాజధాని ఎక్కడుందో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని షర్మిల అన్నారు. అన్ని హామీలను కేంద్రం నెరవేర్చిందని జగన్ అంటున్నారని వివరించారు. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కాదని, అనుభవించు రాజా అని షర్మిల దుయ్యబట్టారు. తునిలో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించలేదని విమర్శించారు. పదేళ్లలో 10 కొత్త పరిశ్రమలు కూడా రాష్ట్రానికి రాలేదన్నారు.
వైఎస్ఆర్ పాలన ప్రజల చేతుల్లో పెడతానని మాటిస్తున్నట్లు షర్మిల వెల్లడించారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలనను ప్రజల గడప ముందుకు తీసుకువస్తానంటూ షర్మిల వ్యాఖ్యానించారు. ఎవరి వద్ద డబ్బులు తీసుకున్నా ఆలోచించి ఓటు వేయండని, ఓటు జీవితాలను మార్చే ఆయుధమని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు ఆమె అభ్యర్థించారు. అవకాశం ఇస్తే చిత్తశుద్ధితో పని చేస్తానని, వైఎస్ఆర్ పాలనను మీ ముంగిటకు తీసుకువస్తానంటూ ఉద్ఘాటించారు.