By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 9, 2024, 12:02 PM IST
వెంటాడుతున్న తాగునీటి సమస్య- జాతీయ రహదారిపై గ్రామస్థుల ఆందోళన
Villagers Protest Solve the Drinking Water Problem: తాగు నీటి సమస్య పరిష్కరించాలంటూ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో గ్రామస్థులు రోడ్డెక్కారు. పంచాయతీ నుంచి విడుదల చేస్తున్న తాగునీరు మురుగుగా వస్తుందని జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. గ్రామంలో చిన్నారులు చదువుకునేందుకు అంగన్వాడీ కేంద్రం లేదన్నారు, గర్భిణులు, బాలింతలను చూసుకునేందుకు కనీసం ఆశా వర్కర్లను కూడా నియమించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థులు మచిలీపట్నం నుంచి విజయవాడకు వెళ్లే జాతీయ రహదారిపై ఆందోళన చేయడంతో అటుగా వెళ్లే వాహనాలు కిలోమీటర్ల మేరకు నిలిచిపోయాయి.
అదే సమయంలో పెనమలూరు నుంచి ఉయ్యూరు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తమ సమస్యలపై గత కొంతకాలంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటి వరకు పరిష్కార మార్గం చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటుగా వెళ్తున్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగీ రమేశ్ ఆందోళనకారుల వద్దకు వచ్చి మాట్లాడారు. స్థానిక, మండల స్థాయి అధికారులు నాలుగు రోజుల్లో సమస్యను పరిష్కరించాలని, లేకుంటే చర్యలు తీసుకుంటారని హెచ్చరించడంతో స్థానికులు ఆందోళనను విరమించారు.