ప్రకాశంలో పులి కలకలం - ఆందోళనలో రైతులు - ప్రకాశంలో పులి సంచారం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 28, 2024, 2:48 PM IST
Tiger Footprints in Prakasam District : ప్రకాశం జిల్లాలో పులులు సంచారంతో స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అర్ధవీడు మండలం గన్నేపల్లి సమీపంలోని పొలాల పక్కన ఉన్న నీటి కుంటలో నీళ్లు తాగేందుకు వచ్చిన పులులను చూసి రైతులు భయాందోళనకు గురి అవుతున్నారు. మొక్కజొన్న తోటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లిన వలి అనే రైతును పెద్దపులి వెంబడించింది. దీంతో వలి పొలం నుంచి గ్రామంలోకి పరుగులు తీశాడు. గ్రామంలోకి వెళ్లి యువకులతో కలిసి పులిని అడవిలోకి తరిమి వేశారు.
గ్రామ సమీపంలో పులులు సంచరిస్తున్న విషయం తెలిసి గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. స్థానికుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు గ్రామ పరిసరాలను పరిశీలించారు. పులులు సంచారాన్ని గుర్తించేందుకు కెమెరాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పులులు గ్రామాలలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. గతంలో కూడా లక్ష్మీపురం, మాగుటూరు, అయ్యవారిపల్లి పరిసర ప్రాంతాలలో పెద్దపులి సంచరించిందని తెలిపారు.