పింఛన్ల పంపిణీపై సీఎం జగన్ మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నారు: టీడీపీ నేత నిమ్మల రామానాయుడు - Nimmala Ramanaidu comments - NIMMALA RAMANAIDU COMMENTS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 1, 2024, 12:42 PM IST
TDP MLA Nimmala Ramanaidu Comments on Pension Distribution : లబ్ధిదారుల పింఛన్ల పంపిణీ వ్యవహారంలో సీఎం జగన్ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పింఛను సొమ్మును సచివాలయాల్లో పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పడం వృద్ధులు, దివ్యాంగులు, వితంతు మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమేనన్నారు. ప్రభుత్వ అధికారులు మురళీధర్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డిలు జగన్ మోహన్ రెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలే గాని సచివాలయాల్లోనే ఇస్తామనడం జగన్ అరాచన పాలనకు నిదర్శనమని రామానాయుడు పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీలో వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చిన క్రమంలో సచివాలయాల సిబ్బందితో ఇంటింటికి పంపిణీ చేయవచ్చని అధికారులు సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సచివాలయ సిబ్బంది పింఛను లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి ఇచ్చే వరకు టీడీపీ జనసేన బీజేపీ కూటమి బాధితులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎలాగైనా గెలవాలని పింఛను లబ్ధిదారులను ఇబ్బందులను పెడుతున్నారని ఆరోపించారు.