రోడ్డు ప్రమాద బీమా క్లెయిమ్లపై అవగాహన సదస్సు - Claim Awareness Program in vijayawa
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 31, 2024, 12:36 PM IST
Road Accident Claim Awareness Program : రోడ్డు ప్రమాద బీమాను సకాలంలో ఏవిధంగా పరిష్కరించాలనే విషయంపై విజయవాడలో అవగాహన సదస్సును నిర్వహించారు. సదస్సుకు సంబంధించిన వర్క్ షాపును ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ ఏవీ శేషసాయి ప్రారంభించారు. ప్రమాద బీమాల పరిష్కారంలో గోహర్ మహ్మద్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అవగాహన కల్పించారు.
పోలీసులు రోడ్డు ప్రమాదాల కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు తీర్పులో ఉందని ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎం.బబిత అన్నారు. మృతుల శవపరీక్ష 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. మూడు నెలల్లోపు క్లెయిమ్ను పూర్తి చేయాలన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీ, బాధితులు రాజీ పడిన తర్వాత నెలరోజుల్లోపు క్లెయిమ్ను అందజేయాలన్నారు. రోడ్డు రవాణా సిబ్బంది, పోలీసులు, ఇన్సూరెన్స్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. కేసు కోర్టులో విచారణ జరుగుతున్నా ప్రమాద బీమా ఇవ్వొచ్చన్నారు. బాధితులకు న్యాయం చేయటం ముఖ్యమని సుప్రీంకోర్టు తెలిపిందన్నారు. పోలీసులు దర్యాప్తులో ఆలస్యం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని తెలిపారు.