లాకౌట్ ప్రకటించిన ఆంధ్రా పేపర్ మిల్ యాజమాన్యం - కార్మికుల ఆగ్రహం - Andhra Paper Limited Lock Out - ANDHRA PAPER LIMITED LOCK OUT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 25, 2024, 2:15 PM IST
Andhra Paper Limited Declares Lock Out: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆంధ్రా పేపర్ మిల్ యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. లాకౌట్కు నిరసనగా కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం వద్ద నిరసనలు వ్యక్తం చేశారు. గత 23 రోజులుగా ఏపీ పేపర్ మిల్ కార్మికులు సమ్మెలో ఉన్నారు. కొత్త వేతన ఒప్పందం కోసం సుమారు 2 వేల 800 మంది కార్మికులు సమ్మె చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అర్ధాంతరంగా పేపర్ మిల్కు లాకౌట్ ప్రకటించడంపై కార్మికులు, కార్మిక సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇటీవల బస్సు యాత్రలో పేపర్ మిల్లు మీదుగా వెళ్తున్న సీఎం జగన్ దృష్టికి కార్మికులు సమస్యను తీసుకుని వెళ్లారు. ప్రస్తుతం కార్మికులకు మద్దతుగా పేపర్ మిల్లు వద్ద రాజమహేంద్రవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత సమస్యలను పరిష్కరిస్తామని అదిరెడ్డి వాసు తెలిపారు. పేపర్ మిల్లు కార్మికులకు సంఘీభావంగా రాజానగరం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ కార్మికులకు అండగా ఉంటామని, ఎన్డీయే కూటమి వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.