మంచినీరు ఇచ్చారా? రోడ్లు వేశారా? - ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతలను నిలదీసిన గిరిజనులు - Protest to YCP Leaders In Campaign - PROTEST TO YCP LEADERS IN CAMPAIGN
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 5, 2024, 2:05 PM IST
Protest to YSRCP Leaders In Election Campaign From Tribals : ఎన్నికలు మరో 8 రోజులే ఉంటడంతో నేతలు ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు ప్రచారానికి ప్రజల్లోకి వస్తున్నారు. కానీ వారికి సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. గతంలో ఓ సారి ఓటు అడగడానికి వచ్చారని, ఐదేళ్ల తర్వాత మళ్లీ ఓటు 'అడుక్కోడానికే' వచ్చారని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. 2019లో గెలిచిన తర్వాత తమ ముఖం చూసిన పాపాన పోలేదని, సమస్యల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారని నిప్పులు చెరిగారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ముఖం చాటేస్తున్నారు వైఎస్సార్సీపీ అభ్యర్థులు.
మంచినీరు ఇచ్చారా? రోడ్లు వేశారా? : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరావు తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అధికార పార్టీ నేతలకు నిరసన సెగ తగిలింది. జీకే వీధి మండలం సంకడ పంచాయతీలో ఉపాధి పనులు చేసుకుంటున్న గిరిజనులను ఆ పార్టీ నేతలు ఓట్లు అభ్యర్థించారు. దీంతో గిరిజనులు వైఎస్సార్సీపీ నేతలపై మండిపడ్డారు. ఐదేళ్ల నుంచి మంచినీరు ఇచ్చారా? రోడ్లు వేశారా? అని నిలదీశారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్ళీ ఓట్ల కోసం ఎలా వచ్చారని ప్రశ్నించారు. దీంతో చేసేదిలేక అధికార పార్టీ నేతలు వెనుదిరిగారు.