కనిగిరిలో అద్భుత దృశ్యం - కశ్మీర్ను తలపించే వాతావరణం
By ETV Bharat Andhra Pradesh Team
Published : 5 hours ago
Pleasant Weather Prakasam: ఓ వైపు ఎండలు, మరోవైపు తుపాను హెచ్చరికలు. వీటన్నింటి నడుమ ప్రకాశం జిల్లా వాసులకు ఓ అద్భుతమైన దృశ్యం కనువిందు చేసింది. దీనిని తమ ఫోన్లలో బంధించి, సామాజిక మాధ్యమాలలో తెగ షేర్ చేస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల ఆకాశంలో ఏర్పడిన కళాత్మకమైన దృశ్యం చూపరులను కట్టిపడేసిన సంఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో చోటు చేసుకుంది. రానున్న తుపాను ప్రభావంతో కనిగిరిలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రంగా ఉండగా మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా వర్షం కురవగా అదే సమయంలో ఇంద్ర ధనుస్సు కూడా వచ్చింది. ఏకకాలంలో ఎండా, వాన, ఇంద్ర ధనుస్సు ఆకాశంలో దర్శనమిస్తూ ఉండటంతో స్థానిక ప్రజలు ఆసక్తిగా చూసి మురిసిపోయారు. ఫోన్లలో ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే తాము కనిగిరిలో ఉన్నామా లేదంటే కశ్మీర్లో ఉన్నామా అనే విధంగా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. కొందరైతే సెల్ఫీలు దిగుతూ వారి వారి సెల్ ఫోన్లలో ఈ దృశ్యాలను బంధించుకున్నారు.