By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 28, 2024, 7:31 PM IST
అక్రమ ఇసుక తవ్వకాలకు రజకుడు బలి - అధికార పార్టీ హత్యే అంటున్న స్థానికులు
Person Died Due to Illegal Sand Mining in Anantapur District : అధికార నేతల అక్రమ ఇసుక రవాణాకు అమాయక ప్రజలు బలి అవుతున్నారని అనంతపురం జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపప్పూరులో పెన్నానదిలో బట్టలు ఉతకటానికి వెళ్లి ప్రమాదవశాత్తు ఇసుక గోతిలో పడి ఓబులేసు అనే వ్యక్తి మృత్యువాతపడ్డాడు. బట్టలు ఉతికి జీవనం సాగిస్తున్న ఓబులేసు వారానికి మూడు రోజులు పెన్నానదిలో బట్టలు ఉతకడానికి వెళ్తూ ఉంటాడు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల మడుగులు ఎండిపోతున్నాయి. దీంతో రోజు వెళ్లే చోటకు కాకుండా నీటి మడుగును వెతుక్కుంటూ వెళ్లి ఇసుక గొయ్యిలో నీట మునిగి మృత్యువాత పడ్డాడు.
గతంలో అశ్వర్థ నారాయణ స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన కర్ణాటక భక్తులు కూడా ఇదే ప్రాంతంలో ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు. అక్రమ ఇసుక తవ్వకాలతోనే పెన్నానదిలో ఇంతమంది మృతి చెందుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపప్పూరులో పెన్నానదిలో వైసీపీ నాయకుల అక్రమ ఇసుక తవ్వకాలు అడ్డుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇసుక దోపిడీపై రెండేళ్లుగా పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం మరో పేద రజకుడు మృత్యువాత పడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలతోనే పెన్నానదిలో ఇంతమంది మృతి చెందుతున్నారని, ఇవన్నీ వైసీపీ ప్రభుత్వ హత్యలేనంటూ తీవ్రంగా స్పందిస్తున్నారు.