చెరువుకు గండి- పొలాల్లోకి చేపలు- ఎగబడ్డ స్థానికులు - Nawabpet pond was hold
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 1, 2024, 6:09 PM IST
Nawabpet Pond was Hold due to Heavy Rains in NTR District : రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు ఎన్టీఆర్ జిల్లాలోని నవాబుపేట చెరువుకు గండి పండింది. చెరువులోని నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తూ దిగువ ప్రాంతాలను ముంచెత్తింది. భారీ వర్షాలతో వరద పోటెత్తడం వల్లే చెరువుకు గండి పడిందని స్థానికులు అంటున్నారు. గత కొన్నేళ్లలో ఎప్పుడూ ఈ స్థాయిలో వర్షాలు పడలేదని, చెరువుకు గండి పడటం కూడా ఎప్పుడూ జరగలేదని స్థానికులు చెబుతున్నారు. నవాబుపేట చెరువుకు గండి పడటంతో వరదనీరు దిగువకు భారీగా వెళుతోంది.
చెరువు నుంచి నీటితోపాటు పెద్దపెద్ద చేపలు పొలాల వైపు వస్తున్నాయి. ఇది గమనించిన నవాబుపేట సమీప గ్రామాల ప్రజలు భారీఎత్తున పొలాల్లోకి దిగి చేపలు పడుతున్నారు. అలాగే విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై వెళ్తున్నవారు సైతం చేపల కోసం పోటిపడుతున్నారు. అదేవిధంగా స్థానికులు కొందరు తాము పట్టిన చేపల్ని రోడ్డు పక్కన ఉంచి వంద, రెండు వందలకు అమ్ముతున్నారు. ఆదివారం కావడంతో తాజా చేపలకు మంచి డిమాండ్ ఉందని అంటున్నారు.