బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న - Teenmar Mallanna On BC Reservation
Published : Aug 29, 2024, 7:54 PM IST
MLC Teenmar Mallanna About BC Reservation Issue : అధికార పార్టీలో ఉన్నప్పటికీ బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, పదవుల కంటే బీసీలే ముఖ్యమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. బీసీ డిమాండ్ల సాధనకై హైదరాబాద్ లక్డీకపూల్లోని ఓ హోటల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు, ఎమ్మెల్సీలు ఎల్.రమణ, తీన్మార్ మల్లన్న, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు.
దిల్లీ రైతుల తరహాలో బీసీ కులగణననపై బలమైన ఉద్యమం రావాలని మల్లన్న కోరారు. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లపై ఎలాంటి పోరాటాలు చేయకున్నా పాలకులు అమలు చేశారని, దీని వల్ల బలహీన వర్గాలు నష్టపోయారని పేర్కొన్నారు. బీసీ కుల గణన విషయంలో రాహుల్ గాంధీ అనుకూలంగా ఉన్నారని, తప్పనిసరిగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు ప్రారంభిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.