సమాధులపై ఫొటోలా సర్వే రాళ్లపై జగన్ చిత్రమా ! : మంత్రి అచ్చెన్న - Atchannaidu Tweet on Jagan - ATCHANNAIDU TWEET ON JAGAN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 30, 2024, 11:59 AM IST
Minister Atchannaidu Tweet on YS Jagan : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. రైతు తన పొలంలో దిష్టిబొమ్మ పెట్టడానికైనా ఒప్పుకుంటారే కానీ పొలం హక్కు పుస్తకాల మీద దిష్టిబొమ్మ పెడితే ఊరుకోరని అన్నారు. సమాధి రాళ్లపై ఫొటో వేసుకున్నట్లు సర్వేరాళ్లపై వేయించారని ఆయన విమర్శించారు. అన్నదాతల పొలాల్లోని సర్వే రాళ్లపై జగన్ తన ఫొటోలు వేయించారని ఆక్షేపించారు. ప్రజల సొమ్ము రూ.650 కోట్లతో సర్వే రాళ్లపై బొమ్మలా అని ప్రశ్నించారు. పబ్లిసిటీ స్టంట్లు చేసినందుకే జగన్ను ప్రజలు ఇంటికి పంపారని అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సీజన్కు పూర్తి స్థాయిలో సంసిద్ధమయ్యామని అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీలో 50 శాతానికి పైగా అధిక వర్షపాతం నమోదు కావటం శుభసూచికమని చెప్పారు. ఉపాధి హామీలో పంట కాలువలు పూడిక తీసేందుకు తక్షణ చర్యలు చేపట్టామని తెలిపారు. పంట పొలాల్లో నీటి నిల్వ తొలగింపు, తేమ ద్వారా ఆశించే తెగుళ్ల నివారణకు రైతులకు సూచనలు చేస్తున్నామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.