రైతుపై దాడి చేసిన ఏనుగుల గుంపు- భయాందోళనలో గ్రామ ప్రజలు - ఏనుగుల దాడిలో రైతుకు గాయాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 14, 2024, 12:58 PM IST
Elephants Attack in Farmer: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు హల్ చల్ చేసింది. మండలంలోని చిన్న రామాపురం పంచాయతీ పరిధిలో ఉన్న కొండ్రెడ్డి కండిక గ్రామాల్లో అర్ధరాత్రి సమయంలో ఏనుగుల గుంపు పంట పొలాలను ధ్వంసం చేసింది. ఆ సమయంలో అక్కడే పొలం దగ్గర కాపలాగా ఉన్న ఓ రైతుపై ఏనుగులు దాడి చేశాయి. ఈ దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రైతును అటవీ శాఖ అధికారులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
సుమారు 15 రోజుల నుంచి తరచూ రాత్రి సమయంలో 17 ఏనుగులు తమ గ్రామాల్లోని పంట పొలాలను నాశనం చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. చేతికి అందివచ్చిన పంటను నాశనం చేస్తున్నాయని రైతులు కుమిలిపోతున్నారు. పంట పొలాలను ధ్వంసం చేయటమే కాకుండా ఉపాధి హామీ పనులకు వెళ్లకుండా చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఏనుగుల దాడులు భరించలేకపోతున్నామని గ్రామ ప్రజలు తెలిపారు. ఎప్పుడు ఏ వైపు నుంచి వచ్చి దాడి చేస్తాయోనని వణికిపోతున్నామన్నారు. అవి అడవుల నుంచి గ్రామాల వైపు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.