అనంతలో సర్వర్ సమస్యతో పింఛన్ల పంపిణీకి బ్రేక్ - సమస్య పరిష్కారంపై ఉద్యోగుల దృష్టి - PENSION DISTRIBUTION IN AP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 1, 2024, 4:30 PM IST
Pension Money News: సర్వర్ లోపంతో పింఛన్ల పంపిణీ అందక వితంతువులు, వృద్ధులు గంటల తరబడి సచివాలయం వద్ద వేచి ఉన్న ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఉదయం నుంచి సచివాలయం వద్ద వారు ఎదురుచూస్తున్నప్పటికీ సాంకేతిక సమస్యల వల్ల పెన్షన్ డబ్బుల పంపిణీ జరగకపోవడంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో సర్వర్ పని చేయకపోవడంతో పింఛన్ల పంపిణీ ఆలస్యం అవుతోంది. ఉదయం నుంచి పింఛన్ల కోసం లబ్ధిదారులు ఉరవకొండలో గల స్థానిక సచివాలయం వద్ద బారులు తీరి వేచి చూశారు. కొన్ని సచివాలయాల్లో మధ్యాహ్నం రండి అని అధికారులు వారికి చెప్పినట్లు లబ్ధిదారులు తెలియజేస్తున్నారు. పెన్షన్ల పంపిణీ విషయంలో అందరూ కొంచెం సంయమనం పాటించాల్సిందిగా అధికారులు వారికి సూచిస్తున్నారు. సాంకేతిక సమస్య పరిష్కారం అయిన వెంటనే అందరికీ త్వరితగతిన పింఛన్ల పంపిణీని పూర్తి చేస్తామని ఉద్యోగులు వారికి నచ్చజెప్పి పంపించే ప్రయత్నం చేస్తున్నారు.