LIVE : కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన - ప్రత్యక్షప్రసారం - CHANDRABABU KUPPAM TOUR LIVE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 7, 2025, 12:14 PM IST
Chandrababu Kuppam Tour Live : కుప్పంలో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. సోమవారం నాడు ఆయన ద్రావిడ యూనివర్సిటీ వేదికగా స్వర్ణ కుప్పం 2029 విజన్ను ఆవిష్కరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఐదేళ్లలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికను వివరించారు. గత పాలకులు కుప్పం అభివృద్ధిని అడ్డుకుని, కార్యకర్తలను ఇబ్బందిపెట్టారని ఇకపై కుప్పం అభివృద్ధి అన్ స్టాపబుల్ అని ఉద్ఘాటించారు. దేవాలయాల్లాంటి విశ్వవిద్యాలయాలను గత ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రాలుగా వాడుకుందని దుయ్యబట్టారు. వర్సిటీ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. నడిమూరు గ్రామంలో పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా సోలార్ పైలట్ ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంభించారు. మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా మొదట కుప్పంలో ప్రయోగించాకే రాష్ట్రమంతటా అమలు చేస్తానని సీఎం అన్నారు. పీఎం సూర్యఘర్ కింద కుప్పం నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వంద శాతం రాయితీతో సౌర ఫలకాలు ఏర్పాటు చేసి విద్యుత్ అందించడమే తన లక్ష్యమన్నారు. శీగలపల్లెలో రైతు సాధికార సంస్థ ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ స్టాళ్లను పరిశీలించిన ముఖ్యమంత్రి రైతులతో ముచ్చటించారు. సాగు పద్ధతులు, అనుభవాలను ముఖ్యమంత్రికి వారు వివరించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు అన్నదాతలు తెలపడంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.