రతన్ టాటా భౌతికకాయానికి సీఎం చంద్రబాబు, లోకేశ్ నివాళులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : 4 hours ago
CM Chandrababu Paid Tribute to Ratan Tata: దిగ్గజ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ గ్రహీత, టాటా సన్స్ సంస్థ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా భౌతికకాయానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. ముంబయిలోని ఎన్సీపీఏ మైదానంలోని రతన్ టాటా పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. రతన్ టాటాతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. అద్భుతమైన మానవతావాదిని కోల్పోవటం దేశానికి తీరని లోటని సీఎం చంద్రబాబు అన్నారు. రతన్ టాటా లాంటి మహోన్నతమైన వ్యక్తి ఈ లోకాన్ని వీడిపోవడం భాదాకరమని అన్నారు. టాటా సంస్థల ఛైర్మన్ చంద్రశేఖరన్తోపాటు గ్రూప్ ఉన్నతాధికారులు, టాటా కుటుంబసభ్యులతో చంద్రబాబు మాట్లాడారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
వర్లి శ్మశానవాటికలో అంత్యక్రియలు: ప్రజల సందర్శనార్థం రతన్ టాటా పార్థివ దేహాన్ని ముంబయిలోని ఎన్సీపీఏ (NCPA) గ్రౌండ్లో ఉంచారు. పలువురు సందర్శించి నివాళులర్పించారు. ముంబయిలోని వర్లి శ్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో మహారాష్ట్ర ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది.
AP CABINET TRIBUTE TO RATAN TATA : రతన్ టాటా మృతికి రాష్ట్ర మంత్రివర్గం నివాళి అర్పించింది. రతన్ టాటా మృతికి సంతాపంగా కేబినెట్లో సీఎం, మంత్రులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఆయన గౌరవసూచకంగా ఇతర అంశాలేవీ చర్చించకూడదని నిర్ణయించిన మంత్రివర్గం, అజెండా అంశాలపై చర్చించకుండా వాయిదా పడింది. కేబినెట్ భేటీకి ముందు రతన్ టాటా చిత్రపటానికి సీఎం చంద్రబాబు, మంత్రులు నివాళులు అర్పించారు.