ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాకిస్థాన్ సబ్​మెరైన్ పీఎన్‌ఎస్‌ ఘాజీ శకలాలు గుర్తింపు - కానీ వాటిని తాకడం లేదు ఎందుకంటే? - PNS Ghazi

Wreckage of Pakistan Submarine PNS Ghazi in Vizag: పాకిస్థాన్‌ జలాంతర్గామి పీఎన్‌ఎస్‌ ఘాజీ శకలాలను ఇండియన్ నేవీకి చెందిన డీఎస్​ఆర్​వీ విశాఖ తీరంలో గుర్తించింది. ఈ జలాంతర్గామి 1971లో భారత్‌-పాక్‌ మధ్య యుద్ధ సమయంలో బంగాళాఖాతంలోకి దొంగచాటుగా ప్రవేశించింది. తీరానికి 2-2.5 కిలోమీటర్ల దూరంలోని సముద్ర జలాల్లో 100 మీటర్ల లోతున ఉన్నట్లు సమాచారం. అయితే యుద్ధంలో చనిపోయిన వారి గౌరవార్థం ఆ శకలాలను తాకడం లేదని నేవీ సీనియర్ అధికారి తెలిపారు.

Wreckage_of_Pakistan_Submarine_PNS_Ghazi_in_Vizag
Wreckage_of_Pakistan_Submarine_PNS_Ghazi_in_Vizag

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 9:59 PM IST

Wreckage of Pakistan Submarine PNS Ghazi in Vizag: విశాఖ తీరంలో పాకిస్థాన్‌ జలాంతర్గామి శకలాలను తాజాగా భారత నౌకాదళం అత్యాధునిక టెక్నాలిజీని ఉపయోగించి గుర్తించింది. 1971 ఇండో-పాక్‌ యుద్ధ సమయంలో బంగాళాఖాతంలోకి దొంగచాటుగా ప్రవేశించిన పీఎన్‌ఎస్‌ ఘాజీ (PNS Ghazi)కి చెందినవిగా వీటిని తేల్చారు. ఈ విషయాన్ని మన నౌకాదళంలోని సబ్‌మెరైన్‌ రెస్క్యూ విభాగానికి చెందిన ఏ సీనియర్ అధికారి తెలిపారు.

భారత అమ్ములపొదిలోకి సరికొత్తగా చేరిన డీఎస్‌ఆర్‌వీ (Deep Submergence Rescue Vehicle) సాయంతో వీటిని కనుగొన్నామన్నారు. విశాఖ తీరానికి కేవలం కొన్ని నాటికల్‌ మైళ్ల దూరంలోనే సముద్ర గర్భాన ఇవి పడి ఉన్నాయని పేర్కొన్నారు. యుద్ధంలో చనిపోయిన వారిని గౌరవించడం మన నౌకాదళ ఆచారమని, అందుకనే ఆ శకలాలను తాకలేదని ఆయన తెలిపారు. తీరానికి 2 నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలోని సముద్ర జలాల్లో 100 మీటర్ల లోతున ఇవి ఉన్నట్లు తెలుస్తోంది.

సబ్‌మెరైన్‌తో సముద్రంలో ద్వారక నగర వీక్షణ- 300 అడుగుల లోతుకు వెళ్లి

డీఎస్‌ఆర్‌వీ టెక్నాలజీ ప్రత్యేకత:సముద్ర గర్భం చాలా కఠినమైనది. సబ్‌మెరైన్ల ప్రయాణం అనేక సవాళ్లతో కూడుకున్న విషయం. అందుకే జలాల కింద ఉపరితలం ఎలా ఉంటుందో అంచనావేసి, మన జలాంతర్గాములు (Submarines) ప్రయాణించేందుకు అనువైన మార్గాలను డీఎస్ఆర్‌వీ సాయంతో మ్యాపింగ్‌ చేస్తారు. విశాఖలో సముద్రం సగటున 16 మీటర్ల లోతు ఉంటుంది. ఇది ఓడలు నిలిపేందుకు అనుకూలమైనది. అంతేకాకుండా జలాంతర్గాములు తీరం సమీపంలోకి వచ్చి వెళ్లేందుకు వీలుగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను చూసే 1971 సంవత్సరంలో పీఎన్‌ఎస్‌ ఘాజీ విశాఖ తీరానికి చేరి నక్కింది.

2013వ సంవత్సరంలో ఐఎన్‌ఎస్‌ సింధ్‌రక్షక్‌ (INS Sindhurakshak) ప్రమాదానికి గురై 13 మంది మరణించడంతో భారత్‌ నేవీ ఆలోచనలో పడింది. ఇటువంటి సమయంలో సిబ్బందిని రక్షించేందుకు వీలుగా 2018లో తొలిసారి డీఎస్‌ఆర్‌వీ టెక్నాలజీని తీసుకొచ్చింది. ప్రమాదానికి గురైన నౌకలు, జలాంతర్గాములను గుర్తించి సహాయక చర్యలు చేపట్టేందుకు డీఎస్​ఆర్​వీని వాడాలని నిర్ణయించింది. ప్రస్తుతం మన వద్ద రెండు డీఎస్‌ఆర్‌వీలు ఉండగా అందులో ఒకటి తూర్పు, మరొకటి పశ్చిమ తీరంలో వాడుతున్నారు. అదే విధంగా వీటిని నౌకలు లేదా విమానాల్లో తరలించవచ్చు. ఇటువంటి టెక్నాలిజీ ప్రపంచంలో ప్రస్తుతం భారత్‌ సహా 12 దేశాల వద్ద మాత్రమే ఉంది. సముద్ర గర్భం లోతుకు వెళ్లే కొద్దీ ఒత్తిడి భారీగా పెరుగుతుంది. అయితే డీఎస్‌ఆర్‌వీకి మాత్రం 650 మీటర్ల దిగువకు వెళ్లి పనిచేసే సామర్థ్యం ఉంది. వైజాగ్‌లోని హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌లో (Hindustan Shipyard) ఇలాంటివి మరో రెండింటిని దేశీయంగా తయారు చేయడంపై భారత్‌ దృష్టిపెట్టింది.

విశాఖలో అట్టహాసంగా మిలన్ 2024 - అబ్బురపరుస్తోన్న విన్యాసాలు

సబ్‌మెరైన్‌ పీఎన్‌ఎస్‌ ఘాజీ గురించి:టెన్చ్‌ శ్రేణికి చెందిన డీజిల్‌ ఎలక్ట్రిక్‌ సబ్‌మెరైన్‌ పీఎన్‌ఎస్‌ ఘాజీ (Submarine PNS Ghazi) వాస్తవంగా అమెరికా నౌకాదళానికి చెందినది. దీనిని యూఎస్‌ఎస్‌ డయాబ్లో (USS Diablo)గా వ్యవహరిస్తారు. అమెరికా 1963లో పాకిస్థాన్​కు లీజుకు ఇచ్చింది. ఇస్లామాబాద్‌ నౌకాదళంలో ఇదే ఫస్ట్ అటాక్‌ సబ్‌మెరైన్‌. ఇది 1971లో భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రగిలిన వెంటనే నవంబర్‌ 14వ తేదీన కరాచీ పోర్టు నుంచి బయల్దేరి దాదాపు 3 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి శ్రీలంక మీదుగా వైజాగ్‌ తీరానికి చేరింది.

భారత్‌ వద్ద ఉన్న ఏకైక విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ (INS Vikrant)ను ధ్వంసం చేయాలన్నదే దాని ప్లాన్. దాని ఎత్తుగడను ముందే నేవీ పసిగట్టింది. దీంతో విక్రాంత్‌ను అండమాన్‌ దీవుల వద్దకు తరలించింది. ఆ స్థానంలో వైజాగ్‌ తీరం నుంచి డెకాయ్‌గా ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌(INS Rajput)ను పంపారు. అది విమానవాహక నౌకలా భారీ సిగ్నల్స్‌ వదలడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో విక్రాంత్‌లోని సిబ్బందిలా ఒకరు తన జబ్బుపడిన తల్లికి టెలిగ్రాం పంపించినట్లుగా కావాలనే భద్రతా ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారు. దీనిని పీఎన్​ఎస్ ఘాజీ పసిగట్టింది.

రాజ్‌పుత్‌నే విక్రాంత్‌గా అనుకొని దాడికి సిద్ధమైంది. డిసెంబర్‌ 3-4 తేదీల అర్ధరాత్రి సముద్రంలో అలజడిని ఐఎన్​ఎస్ రాజ్‌పుత్‌ గుర్తించింది. దానికి కారణం ఏ జలాంతర్గామిగా నిర్ధరించుకొంది. దీంతో రెండు ఛార్జెస్‌ను నీటిలోకి వదిలింది. అదే సమయంలో నీటిలో భారీ పేలుడు జరిగి ఘాజీ మునిగిపోయింది. దీంతో దాదాపు అందులోని 92 మంది పాక్‌ సిబ్బంది చనిపోయారు. పేలుడు జరిగిన సమయం, దాని శకలాల నుంచి సేకరించిన గడియారం ఆగిపోయిన టైమ్​ ఒకటే కావడం విశేషం. ఇది పాకిస్థాన్ దేశ నేవీకి కోలుకోలేని దెబ్బగా మారింది. పీఎన్‌ఎస్‌ ఘాజీ సబ్‌మెరైన్‌ శకలాలు ఇప్పటికీ వైజాగ్​ సమీపంలోని సముద్రం అడుగున ఉన్నాయి. అయితే పాకిస్థాన్ మాత్రం అంతర్గత పేలుడు వల్లే ఇది మునిగిపోయిందని చెబుతోంది.

సముద్రపు దొంగల ఆటకట్టించిన ఇండియన్ నేవీ- 19 మంది సేఫ్

ABOUT THE AUTHOR

...view details