ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Updated : 2 hours ago

ETV Bharat / state

'పిడుగు పడుతుంటే చెట్ల కిందకు పరుగులు తీస్తున్నారా ! - ఇలా చేయండి' - Visakha Cyclone Warning Center

Visakha Cyclone Warning Center Golden Jubilee Celebrations: 2030 నాటికి ప్రతి ఇంటికీ వాతావరణం గురించి తెలియజేసే అధునాతన వ్యవస్థ తీసుకొస్తామని కేంద్ర వాతావరణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ మహాపాత్రో వెల్లడించారు. విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం స్వర్ణోత్సవం, భారత వాతావరణ విభాగం 150 వసంతాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహాపాత్రో 1960-70 సమయంలో తుపానుల్లో ఎక్కువ మంది చనిపోయేవారని తెలిపారు. ఇప్పుడు ఆ సంఖ్యని సున్నాకి తీసుకొచ్చామన్నారు.

THUNDERSTORM ALERT
THUNDERSTORM ALERT (ETV Bharat)

Visakha Cyclone Warning Center Golden Jubilee Celebrations :విశాఖపట్నంలో విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం స్వర్ణోత్సవం, 150 వసంతాల భారత వాతావరణ విభాగం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ ఎం.ఎన్. హరీంద్ర ప్రసాద్‌ హాజరయ్యారు.

నీటి వనరులను పునరుద్ధరించాలి :ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల (పీపీపీ) భాగస్వామ్యంతో వాతావరణ అంచనాలు మెరుగుపరచడంతోపాటు ప్రతి ఒక్కరికీ సమాచారం చేరవేయొచ్చని హరీంద్ర ప్రసాద్‌ తెలిపారు. దీర్ఘకాలంగా వర్షాలు, తుపాన్లు, వడగాలులపై ప్రజలను అప్రమత్తం చేస్తున్న భారత వాతావరణ శాఖ (ఐఎండీ), సీడబ్ల్యూసీని అభినందించారు. ఆర్థిక, సామాజిక మార్పులు, ప్రజల రోజువారీ జీవన విధానం వాతావరణంతో ముడిపడి ఉన్నాయని అన్నారు.

కచ్చితమైన వాతావరణ అంచనాలు, హుటాహుటిన అప్రమత్తం కావడంతో నష్టాలు తగ్గించవచ్చని అన్నారు. జిల్లాలో దాదాపు 14 వేల గృహాలు కొండవాలు ప్రాంతాల్లో ఉన్నాయని, ప్రమాదాలు పొంచిన ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆక్రమణల కారణంగా విజయవాడలో బుడమేరు తీరని వేదన మిగిల్చిందని, ఇప్పటికైనా ఆక్రమణకు గురైన నీటి వనరులను పునరుద్ధరించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.

వాతావరణ ప్రభావం మనపై చాలా ఉంది. అంచనా వేసే శాఖ, సహాయక చర్యలు అందించే శాఖల మధ్య నిరంతరం సహకారం, సమన్వయం ఉండాలి. సమాచారం ఐఎండీకి తెలుస్తుంది. వారి నుంచి సమాచారం వస్తే రైతులు, విద్యార్థులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయొచ్చు. -హరీంద్ర ప్రసాద్‌, విశాఖ జిల్లా కలెక్టర్‌

మరణాల సంఖ్యను తగ్గించాం :2030 నాటికి ప్రతి ఇంటికీ వాతావరణం గురించి తెలియజేసే అధునాతన వ్యవస్థ తీసుకొస్తామని కేంద్ర వాతావరణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ మహాపాత్రో వెల్లడించారు. 1970 దశకంతో పోలిస్తే అధునాతన సాంకేతికత అందుబాటులోకి రావడం, వాతావరణ అంచనాల్లో కచ్చితత్వం పెరగడంతో మరణాల సంఖ్యను తగ్గించామని అన్నారు. దీర్ఘకాలంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం, సీడబ్ల్యూసీకి సహకరిస్తుందని తెలిపారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి వాతావరణ అంచనాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

"5 దేశాలు మాత్రమే పిడుగుల హెచ్చరికలు అందిస్తున్నాయి. పిడుగుల హెచ్చరికలు ప్రతి మూడు గంటలకొకసారి అందిస్తాం. దీనిని ఐఎండీ, ఐఐటీఎం తీసుకొచ్చాయి. దీనివల్ల హెచ్చరికలు వచ్చినవారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు. పిడుగు పడుతుంటే తేమ ప్రదేశాలు, నీళ్లలో, చెట్ల కింద నిలబడకూడదు. ఒక మూసి ఉన్న గదిలో ఉండాలి. తలుపులు, కిటికీలు మూసివేయాలి. ఒకవేళ వాహనంలో ఉంటే డోర్లు, కిటికీలు మూసిఉంచి లోపలే ఉండాలి. దగ్గరలో ఎలాంటి ఇల్లు లేకపోతే మోకాళ్లపై కూర్చోవాలి." - డా. మహాపాత్రో, డైరెక్టర్‌ జనరల్‌, కేంద్ర వాతావరణ విభాగం

స్వర్ణోత్సవ సావనీర్ ఆవిష్కరణ :​ ఐఎండీ విశ్రాంత డీజీ ఏవీఎం అజిత్ త్యాగి మాట్లాడుతూ వాతావరణ మార్పులు దాదాపు 30 రంగాలపై ప్రభావం చూపిస్తున్నాయని అన్నారు. చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి డా.ఎస్.బాలచంద్రన్, ఏయూ వీసీ జి.శశిభూషణరావు, సీడబ్ల్యూసీ ముఖ్య అధికారి భారతి శ్రీకాంత్ సాబ్దే తదితరులు ప్రసంగించారు. అనంతరం సీడబ్ల్యూసీ స్వర్ణోత్సవ సావనీర్​ను ఆవిష్కరించారు.

Last Updated : 2 hours ago

ABOUT THE AUTHOR

...view details