TIRUMALA LADDU ROW MAJOR DEVELOPMENTS: తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై సీబీఐ చేపట్టిన విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం నెయ్యి సరఫరా చేసిన సంస్ధల వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైయిరీ, ఉత్తరప్రదేశ్కు చెందిన పరాగ్ డైయిరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్ధలకు సంబంధించిన కీలక వ్యక్తులను మూడు రోజులుగా తిరుపతిలో విచారిస్తోంది. విచారణకు సహకరించకపోవడంతో పాటు కల్తీ నెయ్యి ఘటనలో వారి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యమవడంతో అరెస్టు చేయనున్నారు.
తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి కల్తీ నెయ్యి వినియోగంపై సీబీఐ నేతృత్వంలో సాగుతున్న దర్యాప్తు కీలకదశకు చేరింది. శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిలో జంతు కళేబరాల ఆవశేషాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మారిన వ్యవహరంపై పూర్తిస్థాయి విచారణ కోరుతూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ నేతృత్వంలో పూర్తిస్థాయి విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. సీబీఐ హైదరాబాద్ డివిజన్ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు, విశాఖ సీబీఐ ఎస్పీ మురళీరాంబతో పాటు రాష్ట్రం నుంచి విశాఖ డీఐజీ గోపినాథ్ జెట్టి, గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారి సత్యకుమార్ పాండా ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది.
గత ఏడాది నవంబర్లో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం పలు దఫాలుగా విచారణ నిర్వహించింది. ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులు తిరుమల, తిరుపతితో పాటు నెయ్యి సరఫరా చేసిన తమిళనాడులోని దుండిగల్ ప్రాంతంలో ఉన్న ఏఆర్ డైయిరీలో విచారణ నిర్వహించారు. మూడు రోజులుగా దర్యాప్తు బృందం సభ్యుడు సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు తిరుపతిలో మకాం వేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. నెయ్యి సరఫరాకు టీటీడీతో ఒప్పందం చేసుకున్న ఏఆర్ డైయిరీ పలు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు.