Sales Of wild Animals In Warangal : ఉమ్మడి వరంగల్ జిల్లా అడవుల్లో వన్యప్రాణులకు నెలవైన ప్రాంతాలున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గోదావరి తీరం వెంట దట్టమైన, పచ్చని అడవులు జంతువుల ఆవాసానికి అనుకూలంగా ఉంటాయి. వేటగాళ్లతో వాటికి ముప్పు వాటిల్లుతోంది. గుట్టుగా వేటాడి వన్యప్రాణుల చర్మాలు, గోళ్లు, మాంసంతో వ్యాపారం చేసుకుంటున్నారు. అధికారులు చర్యలు తీసుకుంటున్నా వేట మాత్రం ఆగడం లేదు. గత శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అరుదైన జంతువులను ఏకంగా ఆన్లైన్లో విక్రయానికి పెట్టారు. నూతన పంథాలో దుండగులు పాంగోలిన్(అలుగు)ను అక్రమ రవాణా చేసేందుకు సిద్ధమయ్యారు.
పర్యవేక్షణ అంతంతే :ఇంత జరుగుతున్నా స్థానిక అధికారులు ఈ విషయాన్ని కనిపెట్టలేదు. వాట్సాప్ గ్రూపును చెన్నై కేంద్రంగా నడిచే వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బోర్డు గుర్తించింది. ఆ వాట్సాప్ గ్రూప్లో బ్యూరో సభ్యులు కొనుగోలుదారులుగా సంప్రదింపులు చేశారు. ఇద్దరు సభ్యులు ఆ నెంబర్ల ఆధారంగా చాట్ చేసుకుంటూ వరంగల్ చేరుకున్నారు. దుండగులు చెప్పినట్లుగా భూపాలపల్లి, కాటారం ప్రాంతాలకు వచ్చారు. మాటు వేసి అలుగును, ముగ్గురు నిందితులను పట్టుకున్నారు.
అలుగు విక్రయంలో ముందుగా ముగ్గురిని పట్టుకున్నారు. అయితే దీని వెనుక తతంగం నడుపుతున్న 8 మందిని గుర్తించారు. కాటారం, భూపాలపల్లి, మహాముత్తారం మండలాలకు చెందిన వివిధ రంగాలకు చెందిన వారుండటం గమనార్హం. అందులో ఓ రాజకీయ నాయకుడు కూడా ఉన్నాడు. ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకుంటే ఈ దందా పూర్తిస్థాయిలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు చెందినవారు ఉండే అవకాశం ఉందని ఓ అధికారి చెప్పారు.
జంతువులను వేటాడుతున్న ముఠా : అంతరించిపోతున్న జంతువులను వేటాడడానికి ముఠాలు తిరుగుతున్నాయి. అడవులలో ఉండే అలుగు, పులి, చిరుత, వాటి చర్మం, నక్షత్ర తాబేలు, రెండు తలల పాము, ఏనుగు దంతాలకు భారీగా డిమాండ్ ఉంటుందనే అపోహతో వీటికోసం వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. కొన్ని ముఠాలు అరుదైన జంతువులకు ధరలు ఊహించుకుని వాటిని గుట్టుగా వేటాడుతూ దందా నడుపుతున్నారు.
వాట్సాప్ గ్రూపు ఏర్పాటు :పాంగోలిన్ లాంటి అరుదైన వన్యప్రాణుల విక్రయాలకు దేశవ్యాప్తంగా పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు సమాచారం. పురాతన వస్తువుల పేరిట దేశవ్యాప్త నెట్వర్క్తో ఓ వాట్సాప్ గ్రూపు నడుపుతున్నారు. ఇందులో భూపాలపల్లి జిల్లాకు చెందిన కొందరు ఉన్నట్లు తెలిసింది. వారే అలుగు ఫొటోలను అప్లోడ్ చేసి అమ్మకానికి పెట్టారు.. ఇలాంటి నెట్వర్క్తో ఇక్కడి వారికి సంబంధాలు ఉండటం విస్తుగొల్పుతోంది. ఎన్నేళ్లుగా ఈ అక్రమ వ్యాపారం జరుగుతుందో తెలుసుకునే పనిలో అటవీ అధికారులు, పోలీసులు ఉన్నారు.