ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏలూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం- దగ్దమైన 20 గుడిసెలు - FIRE ACCIDENT IN KAIKALURU

ఏలూరు జిల్లా భైరవపట్నంలో అగ్నిప్రమాదంలో కాలిపోయిన వేటగాళ్ల గుడిసెలు- క్షతగాత్రులను ప్రైవేటు వాహనాల్లో తరలించిన పోలీసులు

FIRE ACCIDENT IN ELURU DISTRICT
FIRE ACCIDENT IN ELURU DISTRICT (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2025, 10:05 AM IST

Fire Accident In Eluru District:ఏలూరు జిల్లా కైకలూరు మండవల్లి మండలం భైరవపట్నంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రధాన కూడలిలో జాతీయ రహదారి పక్కన ఉండే పక్షుల వేటగాళ్లకు చెందిన 20 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు ఓ మహిళతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దోమల నివారణకు అగరబత్తి వెలిగించగా నాటు తుపాకీలో ఉండే మందు గుండు సామగ్రికి అంటుకుని మంటలు చెలరేగాయి. గుడిసెల్లోని గ్యాస్ సిలిండర్లకు మంటలు వ్యాపించి భారీ పేలుడు సంభవించింది. నెల్లూరుకు చెందిన పక్షుల వేటగాళ్లు సుమారు 20 ఏళ్ల కిందట భైరవపట్నం వచ్చి స్థిరపడ్డారు.

అసలేం జరిగిందంటే? నెల్లూరుకు చెందిన పక్షుల వేటగాళ్లు ఏలూరు జిల్లా కైకలూరు మండవల్లి మండలం భైరవపట్నానికి 20 ఏళ్ల కిందట వచ్చి స్థిరపడ్డారు. ఆక్వా చేపలు రొయ్యల చెరువులపై పక్షులను వేటాడుతూ వేటగాళ్లు జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం రాత్రి 9.45 సమయంలో లోపలికి దోమలు రాకుండా ఉండేందుకు వీరు అగరుబత్తిని వెలిగించారు. వీరికి గల 20 గుడిసెల్లో ప్రతి ఇంట్లో నాటుతుపాకిలో పేలుడుకు ఉపయోగించే మందుగుండు సామగ్రి ఉండటం గమనార్హం. మందుగుండు సామగ్రి ఉండడంతో ఈ మంటలు వాటికి వ్యాపించాయి. దాంతో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. పెద్దఎత్తున మంటలతో పక్కనే ఉన్న 20 గుడిసెలకు క్షణాల్లో మంటలు అంటుకున్నాయి.

మాదాపూర్​లోని బార్​ అండ్​ రెస్టారెంట్​లో అగ్ని ప్రమాదం - భారీ ఆస్తినష్టం

గుడిసెల్లో అగ్నిప్రమాదం సంభవించడంతో లోపల నిద్రిస్తున్న షారుక్‌ఖాన్, వంశీ, అను, కార్తీక్, విక్కీలతోపాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్దఎత్తున మంటలతో పక్కనే ఉన్న 20 గుడిసెలకు క్షణాల్లో మంటలు అంటుకున్నాయి. వీరిలో ఒక బాలుడు, మరో మూడేళ్ల చిన్నారి సైతం ఉన్నారు. పిట్టలను వేటాడటానికి ఉపయోగించే మందుగుండు సామగ్రికి నిప్పు అంటుకోవడంతోనే పేలుడు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. గుడిసెల్లో ఉన్న గ్యాస్‌ బండలు పేలి చూట్టూ భయానక వాతావరణం నెలకొంది. గుడిసెలలోని వస్తువులు, పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాలు సైతం అగ్నికి బూడిదయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడ నుంచి ఏలూరు, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు.

మలక్‌పేట మెట్రో స్టేషన్‌ దగ్గర అగ్ని ప్రమాదం - 5 వాహనాలు దగ్ధం

గంట వరకూ రాని అగ్నిమాపక సిబ్బంది:పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెందుతున్నప్పటికీ వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక వాహనం జాడ కనిపించలేదు. ఆకివీడు నుంచి గంటన్నర తర్వాత వచ్చిన వాహనం మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించింది. కానీ అప్పటికే పూర్తి నష్టం జరిగిపోయింది. 108 వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో క్షతగాత్రులను తరలించాల్సిన దుస్థితి నెలకొంది. డీఎస్పీ శ్రావణ్‌కుమార్, సీఐలు కృష్ణ, రవికుమార్, ఎస్‌ఐ రామచంద్రరావు ఆధ్వర్యంలో పోలీసులు దీనిపై వేగంగా స్పందించి సహాయక చర్యలను చేపట్టారు.

భగ్గుమన్న దోమల మందు - ఎగిసిపడిన అగ్నికీలలు

ABOUT THE AUTHOR

...view details