ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రహదారుల అభివృద్ధిపై సర్కార్ కసరత్తు - రద్దీ రహదారుల ఎంపిక - Roads Development in AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 30, 2024, 9:47 AM IST

Roads Development in AP: రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు వాహన రద్దీ ఎక్కువగా ఉండి, 50 కి.మీ.పైగా దూరం ఉండే రోడ్లను ఇంజినీర్లు ఎంపిక చేశారు. దాదాపు 1,600 కి.మీ. మేరకు ఉన్న వీటిని పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తున్నారు.

Roads_Development_in_AP
Roads_Development_in_AP (ETV Bharat)

Roads Development in AP: రాష్ట్రంలో వాహన రద్దీ అధికంగా ఉన్న రాష్ట్రరహదారుల విస్తరణ, పునరుద్ధరణపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో విస్తరించడంపై కసరత్తు చేస్తోంది. ఇటీవల రహదారులు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ)పై సీఎం వద్ద జరిగిన సమీక్షలో రాష్ట్ర రహదారుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. దీంతో అధికారులు వీటిపై పలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా వాహన రద్దీ ఎక్కువగా ఉన్న రోడ్లను ఎంపిక చేసి, వాటిని 7-10 మీటర్ల మేర విస్తరించేందుకు ప్రతిపాదిస్తున్నారు.

50 కి.మీ.పైగా దూరం ఉండి, వాహన రద్దీ ఎక్కువగా ఉండే 26 రోడ్లను ఇంజినీర్లు ఎంపిక చేశారు. ఇవన్నీ కలిపి దాదాపు 1,600 కిలోమీటర్ల మేరకు ఉన్నాయి. వీటిని పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తున్నారు. కచ్చితంగా ఎంత ట్రాఫిక్‌ రద్దీ ఉంది, వాటిలో కార్లు, లారీలు, బస్సులు వంటి వాహనాలు నిత్యం సగటున ఎన్ని ప్రయాణిస్తున్నాయి, ఆయా రహదారుల విస్తరణకు ఎంత వ్యయమవుతుంది, తదితరాలన్నింటిపై డీపీఆర్‌ సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇందుకు సలహా సంస్థను ఎంపిక చేయాలని భావిస్తున్నారు.

పల్లె రోడ్ల గుంతలు పూడ్చడానికే రూ.1121 కోట్లు - ప్రభుత్వానికి ఇంజినీర్ల నివేదిక - Damaged Roads in AP

టెండర్లు పిలిచి, గుత్తేదారులకు ఆయా రహదారుల విస్తరణ పనులతో పాటు కొంతకాలం నిర్వహణ బాధ్యతను కూడా అప్పగించనున్నారు. ఇందుకయ్యే వ్యయాన్ని గుత్తేదారు టోల్‌ రూపంలో వసూలు చేసుకునేందుకు వీలుకల్పించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఒకవేళ విస్తరణకు అయ్యే వ్యయం మేరకు టోల్‌ వచ్చే అవకాశం లేకపోతే ఆ మిగిలిన మొత్తాన్ని వయబులిటీగ్యాప్‌ ఫండ్‌ రూపంలో ప్రభుత్వం సర్దుబాటు చేసేలా చూడాలని భావిస్తున్నారు.

రాష్ట్ర రహదారుల్లో కొన్నింటి పునరుద్ధరణకు కూడా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానం అమలు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై పరిశీలిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12,592 కి.మీ. మేర రాష్ట్ర రహదారులు ఉన్నాయి. వీటిలో ఏటా సగటున 2,500 కిలోమీటర్ల మేర పునరుద్ధరణ చేయాలి. అంటే గత ఐదేళ్లలో కలిపి మొత్తం 12,592 కిలోమీటర్ల మేర పునరుద్ధరణ జరగాల్సి ఉంది.

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క ఏడాది మాత్రమే 2,329 కిలోమీటర్ల మేర రహదారుల పునరుద్ధరణ చేసి చేతులు దులిపేసుకుంది. ఇందుకోసం 2 వేల కోట్ల రూపాయలను బ్యాంకు నుంచి రుణం తీసుకోగా దానిని చెల్లించేందుకు పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూపాయి చొప్పున రహదారి అభివృద్ధి సెస్‌ విధించింది. ఈ రూపంలో ఏటా 600 కోట్ల రూపాయల చొప్పున 2021 నుంచి వాహనదారులపై భారం వేసింది. గత ప్రభుత్వంలా కాకుండా ఆయా రహదారులను క్రమం తప్పకుండా ఏటా రెన్యువల్‌ చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.

ప్రస్తుత సీఎస్ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ గతంలో ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆయన నేతృత్వంలో రహదారుల అభివృద్ధికి ఓ నివేదిక రూపొందించారు. గనులు, రవాణాశాఖల ద్వారా ప్రభుత్వానికి వచ్చే రాబడిలో చెరో 10 శాతం చొప్పున రహదారుల అభివృద్ధికి కేటాయించాలని సూచించారు. అలాగైతే అన్ని రోడ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయొచ్చని 2018-19లో నివేదిక రూపొందించారు. ఇప్పుడీ నివేదిక అంశాన్ని కూడా త్వరలో సీఎం వద్ద జరిగే సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తోంది.

తిరుపతిలో మాస్టర్‌ ప్లాన్‌ రోడ్ల నిర్మాణంలో అక్రమాలు - అడ్డగోలుగా టీడీఆర్‌ బాండ్లు - Master Plan roads Irregularities

ABOUT THE AUTHOR

...view details