Public in Panic Due to Tiger Wandering in Adilabad District :తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో పెద్దపులి సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చింతలబోరి గ్రామశివారులోని ఫారెస్ట్ సిబ్బందికి మంగళవారం పెద్దపులి కనిపించింది. బుధవారం ఉదయం 6 గంటలకు చింతగూడ పరిసరాల్లో ఓ మహిళకు కనిపించింది. పులిని చూసి భయాందోళనలకు గురైన మహిళ గ్రామస్థులకు సమాచారమిచ్చింది. గ్రామస్థులు వెళ్లి చూడగా అది అప్పటికే పత్తి పంట నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. కొంతసేపటి తర్వాత కొండ ప్రాంతంలోని పొలం వద్ద కట్టేసిన ఎద్దులు పులిని చూసి తాళ్లు తెంపుకొని గ్రామానికి పరుగు తీశాయి.
పులికోసం గాలింపు చర్యలు :చింతగూడ గ్రామస్థులకు కొండ సమీపంలోని పత్తి చేనులో పెద్దపులి అడుగుజాడలు (పాదముద్రలు) కనిపించాయి. బుధవారం సుమారు 20 మంది బేస్క్యాంపు సిబ్బంది పులిని పట్టుకునేందుకు అటవీ ప్రాంతాన్ని గాలిస్తున్నారు. ఈ క్రమంలో బాబెరతండాలోని జాదవ్ దిలీప్నకు చెందిన ఎద్దుపై చింతగూడ ఫారెస్ట్ ఏరియాలోని పెద్దపులి దాడి చేసి చంపినట్లు అటవీ సిబ్బంది గుర్తించారు.
ఇటీవల కాలంలో వన్యప్రాణులు తరచూ జనావాసాలకు సమీపంలోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకు అటవీ ప్రాంతాలు కాంక్రీట్ జంగిల్గా మారుతుండటంతో వాటి అవాసాలకు నష్టం వాటిల్లుతోంది. ఇదిలా ఉండగా ఇటీవల మియాపూర్లో పులి సంచరిస్తుందని వీడియో చక్కర్లు కొట్టింది. సంబంధిత అధకారులు పాదముద్రల ఆధారంగా అది పులి కాదు పిల్లి అని తేల్చేశారు.