REVENUE CONFERENCES IN AP:రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజున రెవెన్యూ సదస్సుల్లో అన్ని గ్రామాల్లోనూ వైఎస్సార్సీపీ నాయకుల అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చాలా చోట్ల రెవెన్యూ అధికారులే భూసమస్యలు సృష్టించిన ఘటనలు బయటపడ్డాయి. మరికొన్ని చోట్ల పరిష్కారం చూపదగిన సమస్యలపైనా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు రైతులను కంటతడి పెట్టించింది. వైఎస్సార్సీపీ హయాంలో భూమాఫియా దౌర్జన్యాలు పరాకాష్టకు చేరిన తీరు స్పష్టమైంది.
సాగునీటి సంఘాల ఎన్నికలకు వేళాయె - మూడంచెలుగా నిర్వహణ
'మీ భూమి-మీ హక్కు'పేరిట రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజున 645 రెవెన్యూ సదస్సులను నిర్వహించగా అందులో సింహభాగం వైఎస్సార్సీపీ నాయకుల అక్రమాలే వెలుగుచూశాయి. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ నాయకుల కబ్జాలు, ఆక్రమణల బాధితులు సదస్సులకు పోటెత్తారు. న్యాయం చేయాలని అధికారులకు వినతులు అందజేశారు. రాయలసీమ జిల్లాల్లో భూమాఫియా పేట్రేగిపోయిందని అధికారుల నుంచి ప్రభుత్వానికి నివేదికలు వెళ్లాయి. ఆయా జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తొలి రోజు నిర్వహించిన సదస్సుల్లో ఎక్కువగా పొలానికి వెళ్లే దారి సమస్యలపైనే ఫిర్యాదులు అందాయి. రీసర్వే వల్ల తలెత్తిన సమస్యలను రైతులు ఏకరవుపెట్టారు.
శ్రీసత్యసాయి జిల్లాలో.. సోమందేపల్లి మండలం నాగినాతనిచెరువులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రి సవిత పాల్గొన్నారు. గ్రామ సచివాలయ వ్యవసాయ సహాయకుడు బాలు పనితీరుపై గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో అతడిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్యలు పరిష్కరించడం లేదంటూ బుసయ్యగారిపల్లికి చెందిన ఓ మహిళ అధికారుల తీరుపై మండిపడ్డారు.