Satya Kumar follower Tried to Encroach Land:శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ మండలంలోని కియా పారిశ్రామికవాడ పరిధిలో విలువైన భూమిని ఆక్రమించేందుకు మంత్రి సత్యకుమార్ ముఖ్య అనుచరుడు ఆదినారాయణ యాదవ్ రౌడీయిజానికి తెగబడ్డారు. మండలంలోని అమ్మవారిపల్లి సమీపంలో జాతీయ రహదారికి అనుకొని ఉన్న కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంపై కన్నేశారు.
ఆదివారం ఎంపీపీ ఆదినారాయణ అనుచరులు వీరంగం సృష్టించారు. జేసీబీతో ప్రహరీని ధ్వంసం చేస్తుండగా అడ్డుకున్న యజమాని ప్రభాకర్పై కర్రలు, రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీనిపై బాధితుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులతో పాటుగా ఓ కారు, ఓ జేసీబీని, వెంట తెచ్చుకున్న రాడ్లు, కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మునిమడుగు గ్రామ పరిధిలోని సర్వే నంబరు 433లో 1.72 ఎకరాల భూమిని 2018లో గుంతకల్లుకు చెందిన ప్రభాకర్ కొనుగోలు చేశారు. ఈ భూమికి ఆనుకొని ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ డైరెక్టర్గా ఉన్న గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన భూములు సైతం ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంపీపీ ఆదినారాయణతో తనకు భూ తగాదాలు ఉన్నాయని తెలిపారు.
ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నుంచి ఎంపీపీగా ఎంపికైన ఆదినారాయణ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి మంత్రి సత్యకుమార్కు ముఖ్య అనుచరుడిగా చలామణి అవుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఆదినారాయణ కారులో కొంతమంది ప్రభాకర్కు చెందిన భూమి వద్దకు వచ్చి బీభత్సం సృష్టించారు. ప్రభాకర్ను ఆదినారాయణతో మాట్లాడించినట్లు తెలుస్తోంది. భూమిలో పని చేయొద్దని చెప్పినా వినవా, చెప్పినట్లు వినకపోతే చంపేస్తానంటూ ఆదినారాయణ ఫోన్లో బెదిరించారని బాధితుడు తెలిపారు. అంతే కాకుండా తనను చంపేయమని అనుచరులకు ఆదేశించినట్లు వాపోయారు.