Lokesh meets Swiss Industrialists :శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్అండ్డీ కేంద్రాలు, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్స్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని పారిశ్రామికవేత్తలను ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కోరారు. పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి అనుకూల వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉందన్నారు. జ్యూరిచ్లో స్విస్ పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమయ్యారు.
ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏడు నెలల క్రితం ఏర్పాటైన ప్రగతిశీల ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను అమలు చేస్తోందని లోకేశ్ వెల్లడించారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా పారిశ్రామిక ప్రోత్సహకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేసే సంస్థలకు 15 రోజుల్లో అన్ని అనుమతులు మంజూరు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేసిందని పేర్కొన్నారు.
"ప్రస్తుతం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి అనుకూలమైన వాతావరణం నెలకొని ఉంది. 1053 కిలోమీటర్ల సుదూర తీరప్రాంతం, విశాలమైన రోడ్లు, ఎయిర్ కనెక్టివిటీ, విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం నౌకాశ్రయాలు ఉన్నాయి. మరో ఏడాదిన్నరలో భోగాపురం, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు అందుబాటులోకి వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డీప్టెక్ రంగాల్లో అధునాతన ఆవిష్కరణల కోసం ఏపీ విశ్వవిద్యాలయాలతో కలసి స్విస్ పరిశోధన సంస్థలు కలసి పని చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా." - లోకేశ్, ఐటీ శాఖ మంత్రి
CM Chandrababu Davos Tour Updates :ఏపీలో స్టార్టప్లను ప్రోత్సహించడం, సాంకేతికత బదిలీల కోసం ఇన్నోవేషన్ హబ్, ఇంక్యుబేటర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని లోకేశ్ పారిశ్రామికవేత్తలను కోరారు. ఆంధ్రప్రదేశ్లో స్విస్ వెకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ మోడల్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర యువత నైపుణ్యాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పుణేలో గెబిరిట్ తరహాలో ప్లంబింగ్ ల్యాబ్లు, శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని లోకేశ్ సూచించారు.
జ్యూరిచ్లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం