Major Bridges Construction Stalled in Srikakulam: గత కొన్నేళ్లుగా వంతెనల నిర్మాణాల పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన వంతెన నిర్మాణాలు నిలిచిపోవడంతో వందలాది గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం చేపట్టిన వంతెనల నిర్మాణాలు 50 శాతంపైగా పూర్తయినా ఐదేళ్లలో వైఎస్సార్సీపీ సర్కార్ వాటిని పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వంతెనలను పూర్తిచేసి తమను కష్టాల నుంచి గట్టెక్కించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదులపై 2014-19 మధ్య టీడీపీ హయాంలో హైలెవెల్ వంతెనల నిర్మాణాలు చేపట్టారు. వంశధార నదిపై నరసన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గాలను కలుపుతూ ఒక వంతెన, రాజాం- ఆమదాలవలస నియోజకవర్గాలను కలుపుతూ నాగావళి నదిపై మరో బ్రిడ్జి 50 శాతం పూర్తి చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పనులను నిలిపివేసింది. దీంతో సకాలంలో వంతెనలు పూర్తవుతాయనుకున్న ప్రజలు నిరాశ చెందుతున్నారు.
బిల్లులు చెల్లించకపోవడంతో: ఇసుకలపేట- వాల్తేరు గ్రామాల మధ్య బలసల రేవు వద్ద నాగావళి నదిపై వంతెన నిర్మాణం కోసం 2018లో టీడీపీ ప్రభుత్వం 60 కోట్లు నిధులు మంజూరు చేసింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస, విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గాలను కలుపుతూ ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేశారు. పనులు ప్రారంభించే సమయంలో ప్రభుత్వం మారింది. 2019లో 80 కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణ పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టింది. 50 శాతం పనులు పూర్తయ్యాయి. గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. పడవ ప్రయాణాలకు అధికారులు అనుమతించకపోవడంతో నది దాటాలంటే దాదాపు 50 కిలోమీటర్లు మేర ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.