Jagananna Colonies Beneficiaries Facing Problems:ప్రజలకు ఇళ్లు కట్టమంటే కాదు ఏకంగా ఊళ్లకు ఊళ్లే కడుతున్నామని సీఎం జగన్ మాటల కోటలు కట్టారు. నగరాలనే అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు పోయారు. అయితే వాస్తవానికి కేంద్రం పట్టణ పేదలకు భారీగా ఇళ్లు మంజూరు చేస్తే, టీడీపీకి పేరు వస్తుందని వేల ఇళ్లను రద్దు చేసిన దురాగతం వైసీపీది.
కట్టిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకుండా, మౌలిక వసతులు కల్పించకుండా ఊళ్లకు ఊళ్లు నిర్మిస్తున్నామని వైసీపీ డబ్బా కొడుతోంది. మరోవైపు పేదలపై బ్యాంకుల రుణ వడ్డీభారం పెరిగిపోతోంది. ఇళ్లలో చేరకుండానే వాయిదాలు కట్టమని తాఖీదులు వస్తున్నాయి. టీడీపీ సానుభూతిపరుల ఇళ్లనూ రద్దు చేస్తున్న దారుణమిది. పేదల సొంతింటి కలను పాతరేసి ఊసరవెల్లి మాదిరి టీడీపీ కట్టిన ఇళ్ల రంగులు మార్చి వికృతానందం పొందిన అరాచకమిది.
సమస్యలకు నిలయాలుగా జగనన్న కాలనీలు - కనీస వసతుల్లేకుండా ఎలా ఉండాలంటూ లబ్ధిదారుల ఆగ్రహం
కోట్ల రూపాయల నిధులు వృథా:ఒక టిడ్కో ఇంటికి కేంద్రం 1.50 లక్షలు రూపాయల సబ్సిడీ ఇస్తోంది. ఇళ్లను కట్టకపోవడంతో రూ.1,076 కోట్ల సబ్సిడీ పేదలు, మధ్యతరగతి కోల్పోయినట్లు అయింది. అఫర్డబుల్ హౌసింగ్ స్కీం(AHP) కింద 91,138 ఇళ్లు మంజూరవగా టీడీపీ పాలనలో 49,489 ఇళ్లు టెండర్లు పిలిచి పనులు అప్పగించారు. దీనిలో 37,950 ఇళ్ల నిర్మాణం అప్పుడే చేపట్టారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది వరకు కట్టనేలేదు. రివర్స్ టెండర్లు పిలిచి కొన్ని అప్పగించారు. ప్రస్తుతం 19,376 టిడ్కో గృహాలు కట్టాలని నిర్ణయించారు. లబ్ధిదారుల జాబితాలనూ మార్చేశారు. విజయవాడ జక్కంపూడి కాలనీలో అయిదు దశల్లో దాదాపు 55 వేల ఇళ్లు కట్టాలనేది లక్ష్యం. ఇప్పుడు 6,576 మాత్రమే నిర్మిస్తున్నారు. గుడివాడలో 8,912 ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చినా ఉండే పరిస్థితి లేదు. కొందరికి తాళాలూ ఇవ్వలేదు. జాబితాలు మార్చేసి వైసీపీ అనుకూలురకు కేటాయించారు.
మారుతున్న జాబితా:రేపో మాపో అని టిడ్కో గృహాలు పూర్తి చేయకుండా వదిలేశారు. కానీ రంగులు మార్చి వైసీపీ రంగులను వేసుకున్నారు. మరోవైపు పూర్తి చేసిన ఇళ్లను వైసీపీ మద్దతుదారులకు కేటాయిస్తూ టీడీపీ సానుభూతి లబ్ధిదారులను కత్తిరిస్తున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల వాటా రూ.50 వేలు చెల్లించినా వివిధ కారణాలతో జాబితా మారుస్తున్నారు. వైసీపీకి అనుకూలమైతే సరే, లేకపోతే ఇంటి కేటాయింపు కొంత ప్రశ్నార్థకమే. వెరసి లబ్ధిదారులు చెప్పుకోలేక అల్లాడుతున్నారు. మరోవైపు బ్యాంకు రుణాలు ఇవ్వమని మెలిక పెడుతున్నాయి. వయసు, డీఫాల్ట్, సిబిల్ స్కోరు గణించి బ్యాంకు రుణాలు మంజూరు చేస్తోంది. దీనికి ప్రభుత్వమే గ్యారెంటీ కావడంతో ఇవి చూడాల్సిన అవసరం లేదు.