ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంతా నా ఇష్టం 'ఏపీఎండీసీలో' పెద్దిరెడ్డి తీరు - పనిలేకపోయినా 370 మందికి జాబ్స్ - FRAUDS IN APMDC

ఏపీఎండీసీలో పెద్దిరెడ్డి ఇష్టారాజ్యం - ఏటా రూ.18 కోట్ల చొప్పున రూ.90 కోట్లు వృథా

PeddiReddy Irregularities in APMDC
PeddiReddy Irregularities in APMDC (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 15, 2025, 10:56 AM IST

PeddiReddy Irregularities in APMDC :గత ప్రభుత్వ హయాంలో ఖనిజాభివృద్ధి సంస్థను జేబు సంస్థగా వాడుకున్న వైఎస్సార్సీపీ నాయకులు ఇష్టానుసారం వ్యహరించారు. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సిఫార్సు ఉంటే చాలు అక్కడ ఉద్యోగం వచ్చినట్లే. ఇంటర్‌ చదివినా అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగం ఇచ్చారంటే ఆ దందా ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. పార్టీ కార్యకర్తలకు, సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసేవారికి, పెద్దిరెడ్డి ఆఫీసులో పనిచేసేవారికీ ఏపీఎండీసీ కొలువుల కామధేనువుగా మారింది.

వైఎస్సార్సీపీ పాలనలో ఏపీఎండీసీలో కాంట్రాక్ట్‌ విధానంలో 270 మంది, పొరుగుసేవల కింద 100 మందిని తీసుకున్నారు. మొత్తం 370 మందిలో నోటిఫికేషన్‌ ద్వారా కాంట్రాక్ట్‌ విధానంలో ఎంపికైనవారు కేవలం 13 మంది మాత్రమే ఉండటం గమనార్హం. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి గత ప్రభుత్వంలో ఏపీఎండీసీని శాసించారు. వీరు చెప్పినవారందరికీ అక్కడ ఉద్యోగాలిచ్చారు.

Frauds in APMDC : రామచంద్రారెడ్డి సిఫార్సులతో ఏకంగా 95 మందికి, ఎంపీ మిథున్‌రెడ్డి సిఫార్సుతో 45 మంది, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి చెప్పారని మరో 60 మందిని కొలువులో చేర్చుకున్నారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యేగా ఉన్న కొరముట్ల శ్రీనివాసుల సిఫార్సుతో మరో 25 మందికి ఉద్యోగాలిచ్చారు. గత సీఎం కార్యదర్శులు, ఓఎస్‌డీ, తదితరుల సిఫార్సులతో మరో 25 మందిని తీసుకున్నారు. అదానీ సంస్థ పీఆర్వోగా ఉంటూ, గత సీఎంఓలో తిష్ట వేసుకుని ఉండే పి.అంజిరెడ్డి సిఫార్సుతో ఇద్దరికి ఉద్యోగాలివ్వడం అరాచకానికి పరాకాష్ఠ.

మధ్యప్రదేశ్‌లోని సులియారీ బొగ్గు ప్రాజెక్ట్‌ మినహా గత ప్రభుత్వంలో ఏపీఎండీసీ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల్లేవు. సులియారీలో ఉత్తరాదికి చెందినవారిని నియమించుకున్నారు. అయినా సరే ఇక్కడి ఏపీఎండీసీకి అవసరమంటూ ఏకంగా 370 మంది ఉద్యోగులను నియమించుకొని ఐదు సంవత్సరాల పాటు పోషించారు. వీరిలో 70 మంది వరకు చీమకుర్తి గ్రానైట్‌ ప్రాజెక్ట్‌లో, మిగిలిన 300 మంది ఏపీఎండీసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నట్లు చూపారు.

చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన హేమంత్‌కుమార్‌రెడ్డి, సామాజిక మాధ్యమాల్లో ఆ పార్టీ కోసం ప్రచారం చేసిన యారా సాయిప్రశాంత్‌ను అసిస్టెంట్‌ మేనేజర్లుగా పనిచేస్తున్నట్లు చూపించి నెలకు రూ.70,000ల జీతం ఇచ్చారు. అంటే దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో తెలుస్తోంది. ఎన్నికల సమయంలో హేమంత్‌రెడ్డి నేరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థులతో కలిసి ప్రచారం చేశారు. యారా ప్రశాంత్‌ సోషల్‌ మీడియా పోస్టులపై ఈనాడు - ఈటీవీ భారత్​లో కథనం రావడంతో ఆ ఇద్దరినీ తప్పనిసరి పరిస్థితిలో తొలగించారు.

తిరుపతిలోని పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డిల కార్యాలయంలో పనిచేసే తేజేష్‌రెడ్డిని సైతం ఏపీఎండీసీలో మేనేజర్‌ కేడర్‌ ఉద్యోగిగా చూపించి రూ.70,000లు చెల్లించడం విశేషం. నేతల సిఫార్సులతో తీసుకున్న ఉద్యోగులకు నెలకు దాదాపు కోటిన్నర చొప్పున ఏటా రూ.18 కోట్ల మేర ఏపీఎండీసీ నిధులు చెల్లించారు. ఇలా ఐదేళ్లలోనే రూ.90 కోట్ల ప్రజాధనాన్ని వీరికి ధారపోశారు.

ప్రభుత్వ జీతం తీసుకుంటూ వైసీపీకి ఊడిగం - ఏపీఎండీసీలో ఉద్యోగులుగా అధికార పార్టీ నేతలు - YSRCP Leaders as APMDC Employees

పెద్దిరెడ్డి సేవలో ఏపీఎండీసీ మాజీ ఎండీ - అడ్డగోలుగా గ్రానైట్ ​లీజు మంజూరు - Mining lease irregularities

ABOUT THE AUTHOR

...view details