ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పడవలో వెళ్లి - అమరావతి ఐకానిక్​ టవర్ల​ను పరిశీలించిన ఐఐటీ బృందం - IIT Madras Team Visit Amaravati

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 3, 2024, 12:00 PM IST

Updated : Aug 3, 2024, 4:33 PM IST

IIT Madras Team Visit Amaravati: అమరావతి రాజధానిలో ఐదేళ్లుగా నీటిలో మునిగిన ఐకానిక్ భవనాల రాఫ్ట్ ఫౌండేషన్​ను ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం పరిశీలించింది. సచివాలయం, హెచ్​ఓడీ, అసెంబ్లీ, హైకోర్టు భవన నిర్మాణాలకు సంబంధించిన పటిష్టతపై ఈ నిపుణుల బృందం అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది. మరోవైపు రాజధాని ప్రాంతంలోని రహదారులు, డక్ట్‌లు, ఇతర నిర్మాణాలను ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ఇంజనీర్ల బృందం పరిశీలించింది.

IIT Madras Team Visit Amaravati
IIT Madras Team Visit Amaravati (ETV Bharat)

IIT Madras Team Visit Amaravati :రాజధాని అమరావతిలో ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన నిపుణుల బృందాలు పర్యటించాయి. ఐదేళ్లుగా ఎండకు, ఎండి వానకు తడిచిన నిర్మాణాలతో పాటు ఐదేళ్ల నుంచి పూర్తిగా నీటిలోనే మునిగి ఉన్న ఐకానిక్ టవర్ల ర్యాఫ్ట్ ఫౌండేషన్​ను ఐఐటీ మద్రాస్‌కు చెందిన నిపుణుల బృందం పరిశీలించింది. సచివాలయం, హెచ్​ఓడీ భవనాలు, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాలకు సంబంధించిన ఫౌండేషన్ బేస్ మెంట్లను పరిశీలించారు. ఐఐటీ మద్రాస్‌లోని స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రోఫెసర్ మెహర్ ప్రసాద్, కొరోజన్ విభాగంలో నిపుణుడైన ప్రోఫెసర్ రాధాకృష్ణ పిళ్లై, ఫౌండేషన్, మెటీరియల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన నిపుణుడు ప్రోఫెసర్ సుభాదీప్ బెనర్జీలు అమరావతిలోని ఈ భవనాలకు సంబంధించిన ర్యాఫ్ట్ ఫౌండేషన్​ను పరిశీలించారు.

ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు ఏర్పాటు చేసిన బోట్లలో నీట మునిగిన సచివాలయం, హెచ్​ఓడీ ఐకానిక్ టవర్లకు చెందిన పిల్లర్లు, రాఫ్ట్ ఫౌండేషన్ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ఈ రాఫ్ట్ ఫౌండేషన్ వేసిన ప్రాంతం అంతా గడచిన ఐదేళ్లుగా పూర్తిగా నీటిలో మునిగి ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. ఈ ప్రాంతంలో దాదాపుగా 0.7 టీఎంసీల నీరు నిల్వ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం నీటిలో మునిగిపోయి ఉన్న రాఫ్ట్ పౌండేషన్, బేస్ మెంట్ల వద్ద నిర్మాణాల్లో వినియోగించిన ఇనుము పూర్తిగా తుప్పు బట్టిపోయిందని వాటి పటిష్టత పై సాంకేతికంగా పరీక్షలు నిర్వహించాల్సి ఉందని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో నీట మునిగిన ప్రాంతాల్లో భూ సామర్థ్యపు పరీక్షలు నిర్వహించాల్సి ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఐకానిక్ టవర్లు దాదాపు 40 నుంచి 46 అంతస్తులుగా నిర్మించాలని ప్రణాళిక చేసినందున ఆ మేరకు ఎంత భారాన్ని ప్రస్తుతం ఉన్న ప్రాంతం మోయగలుగుతుందన్న దానిపై పరీక్షలు చేయాల్సి ఉందని తెలుస్తోంది.

'కట్టడాల సామర్థ్యం గురించి ఇప్పుడే చెప్పలేం' - ఐఐటీ నిపుణుల అభిప్రాయం - IIT Teams at Amaravati

మరోవైపు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఉద్యోగులకు చెందిన నివాస సముదాయాల్లో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాల వద్ద ఇనుప చువ్వలు పూర్తిగా తుప్పుబట్టాయి. తదుపరి నిర్మాణాల కోసం వీటిని పూర్తిగా తొలగించాల్సి రావొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాటిని పూర్తిగా శుభ్రం చేశాకే పనులు ప్రారంభించాల్సి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. విభాగాధిపతులు, మంత్రుల క్వార్టర్లకు చెందిన బంగళాల్లో ఇనుపచువ్వలు తుప్పుబట్టటం, కాంక్రీటు స్తంభాల్లో పగుళ్లు ఏర్పడినట్టు నిపుణులు గుర్తించారు.

కట్టడాల పటిష్టత అంచనా వేసేందుకు మట్టిపరీక్షలతో పాటు నాన్ డిస్ట్రక్టివ్, కోర్ కటింగ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని సూచించినట్టు తెలుస్తోంది. అటు దెబ్బతిన్న రహదారులు, డ్రెయిన్లు, రహదారుల వెంబడి ఏర్పాటు చేసిన డక్ట్ లను కూడా ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందం పరిశీలించింది. లోతుగా అధ్యయనం చేశాక ఈ రెండు బృందాలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నాయి.

అమరావతిలో ఐదేళ్లుగా నీళ్లలోనే భవనాల పునాదులు - పటిష్ఠత నిర్థారణకు ఐఐటీ బృందాల పర్యటన - Review on Amaravati Situation

రాజధాని అమరావతిలో ఐఐటీ హైదరాబాద్‌ నిపుణుల పరిశీలన - IIT Teams Visit Amaravati Today

Last Updated : Aug 3, 2024, 4:33 PM IST

ABOUT THE AUTHOR

...view details