తెలంగాణ

telangana

హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణకు తొలగిన అడ్డంకులు - టోల్‌ బాధ్యత నుంచి జీఎమ్మార్‌ ఔట్! - hyderabad vijayawada highway

By ETV Bharat Telangana Team

Published : Jun 27, 2024, 8:45 AM IST

Hyderabad-Vijayawada Highway Expansion : హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఎన్‌హెచ్‌ఏఐ జీఎమ్మార్‌ నుంచి హైవే నిర్వహణను తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు టోల్‌ వసూలు బాధ్యత నుంచి వైదొలగేందుకు జీఎమ్మార్‌ సంస్థ అంగీకరించింది. దీంతో హైదరాబాద్‌-విజయవాడ రహదారి విస్తరణకు అడ్డంకులు తొలగనున్నాయి.

Hyderabad-Vijayawada Road
Hyderabad-Vijayawada Road (ETV Bharat)

Hyderabad-Vijayawada National Highway Expansion : హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు పనులకు అడ్డంకులు తొలగనున్నాయి. హైవేపై టోల్‌ వసూలు బాధ్యత నుంచి జీఎమ్మార్‌ సంస్థ వైదొలగనుంది. ఆ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ), జీఎమ్మార్‌ మధ్య ఒప్పందం కుదిరింది. నూతన గుత్తేదారు ఎంపికయ్యే వరకు, జులై ఒకటి నుంచి ఎన్‌హెచ్‌ఐఏనే టోల్‌ వసూలు చేస్తుంది.

మొదట్లో రెండు వరుసల్లో ఉన్న హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిని బీవోటీ పద్ధతిన విస్తరించడానికి 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం టెండరు పిలిచింది. జీఎమ్మార్‌ సంస్థ రూ.1740 కోట్లకు టెండర్‌ వేసి, పనులను స్వంతం చేసుకుంది. యాదాద్రి - భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు 181.50 కిలోమీటర్ల పొడవున రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించింది. 2012 డిసెంబరులో పనులను పూర్తి చేసి, తెలంగాణలో పంతంగి, కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్‌ ప్లాజాలను నిర్వహిస్తోంది. 2025 జూన్‌తో టోల్‌ వసూళ్ల గడువు ముగుస్తోంది. అయితే, ఈలోపే జీఎమ్మార్‌ నుంచి హైవే నిర్వహణను తీసుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించడం గమనార్హం.

First Electric Highway In India : దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైవే అక్కడే.. ఇక రైళ్ల మాదిరిగానే!

కోర్టుకు వెళ్లడంతో పనులు ఆలస్యం:హైవే విస్తరణకు భూసేకరణ చేస్తున్న సమయంలోనే ఆరు వరుసల నిర్మాణానికి సరిపడే విధంగా భూమిని సేకరించారు. నాడు టెండరు దక్కించుకున్న జీఎమ్మార్‌ సంస్థే, హైవేను 2024 వరకు ఆరు వరుసల్లో విస్తరించాలనే ఒప్పందం. కానీ, తెలుగు రాష్ట్రాల విభజనతో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని జీఎమ్మార్‌ సంస్థ కోర్టును ఆశ్రయించింది.

అప్పట్లో రవాణా వాహనాలు ఇసుక కోసం లారీలు ఏపీకి భారీగా వెళ్లేవి. తెలంగాణ ఏర్పాటయ్యాక వాటి సంఖ్య భారీగా తగ్గింది. దాంతో రోజుకు రూ.20 లక్షల చొప్పున నెలకు రూ.6 కోట్ల వరకు నష్టం వస్తోందని జీఎమ్మార్ పేర్కొంది. ఈ కారణంతో విస్తరణ ఆగిపోయింది. జీఎమ్మార్, ఎన్‌హెచ్‌ఏఐల మధ్య అనేక చర్చల అనంతరం, గడువు కన్నా ముందే టోల్‌ వసూలు బాధ్యత నుంచి వైదొలగేందుకు జీఎమ్మార్‌ సంస్థ అంగీకరించింది. దాంతో ఆ సంస్థకు నష్టపరిహారం చెల్లించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ సైతం ఒప్పుకొంది. ఎంత, ఎప్పటిలోగా చెల్లిస్తుందనే సమాచారం బహిర్గతం కాలేదు. అయితే, రెండు దఫాలుగా ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం.

మూడు నెలల కోసం రెండు ఏజెన్సీల ఎంపిక : ఎన్‌హెచ్‌ఏఐ పర్యవేక్షణలో మూడు నెలలపాటు తాత్కాలిక ప్రాతిపదికన టోల్‌ వసూలుకు రెండు ఏజెన్సీలను ఎంపిక చేసింది. పంతంగి, కొర్లపహాడ్‌లలో టోల్‌ వసూలు బాధ్యతను స్కైల్యాబ్‌ ఇన్‌ఫ్రాకు అప్పగించింది. చిల్లకల్లులో వసూలు బాధ్యతను కోరల్‌ ఇన్‌ఫ్రా సంస్థలు దక్కించుకున్నాయి.

కొనసాగనున్న బ్లాక్‌స్పాట్ల దిద్దుబాటు:ఈ రహదారిపై అధిక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రమాదాల నివారణకు 17 బ్లాక్‌ స్పాట్లలో అండర్‌పాస్‌లు, సర్వీసు రోడ్ల నిర్మాణాలకు ఎన్‌హెచ్‌ఏఐ పలుమార్లు టెండర్లు పిలిచింది. హరియాణాకు చెందిన రాంకుమార్‌ సంస్థ టెండర్లు దక్కించుకుంది. ఈ పనులూ తమకే ఇవ్వాలంటూ జీఎమ్మార్‌ కోర్టుకు వెళ్లడంతో మూడేళ్లు ఆలస్యమైంది. ఇటీవల దిద్దుబాటు పనులకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ మార్గాన్ని త్వరలో విస్తరించనున్నప్పటికీ బ్లాక్‌ స్పాట్‌ పనులకు ఎలాంటి ఆటంకం ఉండబోదని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

పాలమూరు జిల్లాలో మరో జాతీయ రహదారి విస్తరణ

ABOUT THE AUTHOR

...view details