ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గతేడాది రూ.27 లక్షలు పలికిన హైదరాబాద్ బాలాపూర్​ లడ్డూ - ఈసారి ఎంత పలికిందంటే? - Balapur Laddu Auction 2024

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 17, 2024, 11:18 AM IST

Balapur Laddu Auction 2024: గణేశుడి పండుగంటే గల్లీ నుంచి దిల్లీ వరకు మాములుగా ఉండదు. ఈ ఉత్సవాల్లో లడ్డూ వేలం పాట ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇందులోనూ వేలంలో రికార్డు స్థాయి ధరతో ప్రత్యేక గుర్తింపు పొందాడు బాలాపూర్‌ గణేశుడు. గతేడాది రూ.27 లక్షలు పలికిన ఈ లడ్డూను, ఈసారి రూ.30.1 లక్షలకు కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారు.

Balapur Laddu Auction Winner Kolanu Shanakar Reddy
Balapur Laddu Auction Winner Kolanu Shanakar Reddy (ETV Bharat)

Balapur Laddu Auction Winner Kolanu Shankar Reddy : పార్వతీ పుత్రుని చవితి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. వాటిలో ఖైరతాబాద్‌ బడా గణేశుడితో పాటు బాలాపూర్‌ గణపతి యావత్‌ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. లక్షల్లో లడ్డూ వేలం పలుకుతూ అందరి దృష్టి ఆకర్షించే బాలాపూర్‌ గణనాథుని చరిత్ర ఎంతో ఘనంగా ఉంది. లడ్డూ కొన్నవారికి కొంగు బంగారం అవుతుందనే నమ్మకం ఉండడంతో, ఈ ఏడాది సైతం రికార్డు స్థాయి ధర పలికింది. స్థానికుడు కొలను శంకర్ రెడ్డి, వేలం పాటలో రూ.30.1 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.

బాలాపూర్ లడ్డూ దేశ ప్రధానికి అంకితం : బాలాపూర్ గణేశుడి లడ్డూ మరోసారి స్థానికులకే దక్కింది. లడ్డూ వేలం పాటను ప్రారంభించిన కొలను కుటుంబ సభ్యులు తొమ్మిదోసారి లడ్డూను కైవసం చేసుకున్నారు. ఈసారి కొలను శంకర్ రెడ్డి రూ.30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డూ ఛేజిక్కించుకున్నారు. ముగ్గురు స్థానికేతరులతో నువ్వా-నేనా అన్నట్లు పోటీ పడిన శంకర్ రెడ్డి, గతేడాది కంటే రూ.3 లక్షల ఒక వెయ్యి రూపాయలు అధికంగా వేలం పాడి బాలాపూర్ లడ్డూ విజేతగా నిలిచారు.

చవితి వేడుకల్లో 40 ఏళ్ల కిందట లడ్డూ వేలం పాటను మొదలుపెట్టిన తమ కుటుంబానికి మరోసారి గణేశుడి ఆశీర్వాదం లభించడం పట్ల కొలను శంకర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. బాలాపూర్ లడ్డూను దేశ ప్రధాని మోదీకి అంకితం ఇస్తున్నట్లు శంకర్ రెడ్డి వెల్లడించారు. లడ్డూ వేలం పాటకు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా, మాజీ ఎమ్మెల్యే తీగల, మాజీ జడ్పీ ఛైర్మన్ అనితా హరినాథరెడ్డి, భాగ్యనగర ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు.

బాలాపూర్ చరిత్ర - వేలం పాటకు రికార్డ్స్​ బ్రేక్​​​ :బాలాపూర్‌లో ప్రతిష్టించే విజ్ఞాధిపతికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. భాగ్యనగరంలో బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాటకు ఘన చరిత్ర ఉంది. లంబోదరుడి చేతిలో పూజలు అందుకున్న లడ్డును దక్కించుకుంటే, వారింట సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. బాలాపూర్‌లో తొలిసారిగా 1980లో గణేశుడి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఉత్సవ నిర్వాహకులు 1994లో మొదటిసారి లడ్డూ వేలం నిర్వహించారు. తొలి వేలం పాటలో రూ.450కి స్థానికుడు కొలను మోహన్​రెడ్డి గెలుపొందారు.

పొందిన లడ్డూను కుటుంబసభ్యులకు ఇవ్వడంతో పాటు వ్యవసాయ క్షేత్రంలో చల్లారు. ఆ కుటుంబానికి, కొలను మోహన్​రెడ్డికి ఆ ఏడాది అన్ని పనుల్లోనూ మంచి జరిగింది. లడ్డూ పొందడం ద్వారానే బాగా కలిసొచ్చిందని భావించిన మోహన్‌రెడ్డి, మరుసటి ఏడాది 1995లో మళ్లీ వేలంలో పాల్గొని లడ్డూను దక్కించుకున్నారు. అప్పుడు వేలం ధర రూ.4,500. నేటితో ఆ ధరను పోలిస్తే రూ.లక్షకు పైగా ఉంటుంది. ఆ సంవత్సరం కూడా లడ్డూ పొందిన అతడికి అన్ని విధాలా కలిసొచ్చింది.

9సార్లు కొలను వంశస్తులకే ఆ మహా ప్రసాదం :ఇలా 1994లో రూ.450తో మొదలైన లడ్డూవేలం పాట, వందలు, వేలు దాటి రికార్డు స్థాయిలో లక్షలు పలుకుతోంది. 2001 వరకు బాలాపూర్ లడ్డూ వేలల్లోనే పలికింది. 2002లో కందాడ మాధవరెడ్డి పోటీపడి రూ.1,05,000కు లడ్డూ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఏడాది నుంచి ఒక్కో లక్ష పెరుగుతూ వచ్చింది. 2007లో స్థానికుడు రఘునందనచారి 4,15,000 రూపాయలకు పాట పాడి లడ్డూను దక్కించుకున్నారు. 2015లో బాలాపూర్ లడ్డూ రూ.10 లక్షలు దాటి రికార్డు సృష్టించింది. కల్లెం మదన్ మోహన్‌రెడ్డి రూ.10,32,000 లకు లడ్డూను దక్కించుకున్నారు. కాగా ఇప్పటివరకు జరిగిన బాలాపూర్‌ వేలంలో అత్యధికంగా 8 సార్లు కొలను వంశస్తులే దక్కించుకోవటం గమనార్హం. గతేడాది 2023లో రూ.27 లక్షలకు లడ్డూ వేలం ధర పలకగా, ఈసారి అంచనాలకు తగ్గట్టు రూ.30.01 లక్షలకు కొలను కుంటుంబం మళ్లీ లడ్డూను దక్కించుకుంది. దీంతో తొమ్మిది సార్లు కొలను కుటుంబమే ఆ మహా ప్రసాదాన్ని దక్కించుకున్నట్లైంది.

బాలాపూర్ లడ్డూ వేలం విన్నర్స్​ లిస్ట్​ :

క్రమ సంఖ్య లడ్డూ విజేత వేలం పాట సంవత్సరం వేలం ధర (రూ.)
01 కొలను మోహన్​రెడ్డి 1994 450
02 కొలను మోహన్​రెడ్డి 1995 4,500
03 కొలను కృష్ణా రెడ్డి 1996 18,000
04 కొలను కృష్ణా రెడ్డి 1997 28,000
05 కొలను మోహన్​రెడ్డి 1998 51,000
06 కళ్లెం అంజి రెడ్డి 1999 65,000
07 కళ్లెం ప్రతాప్ రెడ్డి 2000 66,000
08 జీ రఘునందన్ చారి 2001 85,000
09 కందాడ మాధవ రెడ్డి 2002 1,05,000
10 చిగిరింత బాల రెడ్డి 2003 1,55,000
11 కొలను మోహన్​రెడ్డి 2004 2,01,000
12 ఇబ్రామ్ శేఖర్ 2005 2,08,000
13 చిగిరింత తిరుపతి రెడ్డి 2006 3,00,000
14 జీ రఘునందన్ చారి 2007 4,15,000
15 కొలను మోహన్​రెడ్డి 2008 5,07,000
16 సరిత 2009 5,10,000
17 కొడాలి శ్రీధర్ బాబు 2010 5,35,000
18 కొలను బ్రదర్స్ 2011 5,45,000
19 పన్నాల గోవర్ధన్ రెడ్డి 2012 7,50,000
20 తీగల కృష్ణా రెడ్డి 2013 9,26,000
21 సింగిరెడ్డి జైహింద్ రెడ్డి 2014 9,50,000
22 కళ్లెం మదన్ మోహన్ రెడ్డి 2015 10,32,000
23 కందాడి స్కైలాబ్ రెడ్డి 2016 14,65,000
24 నాగం తిరుపతి రెడ్డి 2017 15,60,000
25 తేరేటిపల్లి శ్రీనివాస్ గుప్ 2018 16,60,000
26 కొలను రామ్ రెడ్డి 2019 17,60,000
27 నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2020 కరోనా కారణంగా వేలం నిర్వహించలేదు
28 రమేశ్​ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డి 2021 18,90,000
29 వంగేటి లక్ష్మా రెడ్డి 2022 24,60,000
30 దాసరి దయానంద రెడ్డి 2023 27,00,000
31 కొలను శంకర్ రెడ్డి 2024 30,01,000

ఏకంగా రూ.1.87 కోట్లు పలికిన గణేశ్ లడ్డూ ధర - ఎక్కడో తెలుసా? - Bandlaguda Laddu Auction 2024

ABOUT THE AUTHOR

...view details