HC On Vasudeva Reddy Bail Petition: గుడివాడ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఏపీ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీఎస్బీసీఎల్) పూర్వ ఎండీ, ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.
బహిరంగ టెండర్ ద్వారా 2011లో సీతామహాలక్ష్మి అనే మహిళ ఏపీ బెవరేజెస్ లిక్కర్ గోడౌన్ లైసెన్స్ పొందారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక పద్మారెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చేందుకు వాసుదేవరెడ్డి, అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, ఆయన అనుచరులు ప్రయత్నించారని సీతామహాలక్ష్మి కుమారుడు దుగ్గిరాల ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అంతటితో ఆగకుండా కొడాలి నాని అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. తమ గోడౌన్ లైసెన్స్ లీజు ఒప్పందం ముగియకుండానే బెదిరించి, బలవంతంగా ఖాళీ చేయించారన్నారు. లిక్కర్ బాక్సులను పగలకొట్టి తగలబెట్టారన్నారు. దుర్భాషలాడారన్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.