ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు - పూర్తిస్థాయి నీటిమట్టానికి జలాశయాలు - Heavy Rains in Uttarandra

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 9, 2024, 10:44 AM IST

Heavy Rains in Uttarandra District : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు ఉప్పొంగి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రహదారులు జలమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పంట పొలాలు మునిగిపోయి రైతులు లబోదిబోమంటున్నారు.

HEAVY RAINS IN UTTARANDRA
HEAVY RAINS IN UTTARANDRA (ETV Bharat)

Heavy Rains in Uttarandra District : అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలు ఉత్తరాంధ్రను ముంచెత్తుతున్నాయి. విశాఖలో ఎడతెరిపి లేని వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. గోపాలపట్నం, రామకృష్ణనగర్ మార్గంలో కొండచరియలు విరిగి 5 ఇళ్లు ప్రమాదపు అంచున ఉన్నాయి. ఎమ్మెల్యే గణబాబు అక్కడ నివాసితులను అప్రమతం చేసి సురక్షితంగా పునరావాస కేంద్రానికి తరలించారు. వర్షాలకు ఆనందపురం హైస్కూల్ ప్రహరీ గోడ కూలి రెండు ద్విచక్రవాహనాలు, ఒక రిక్షా పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులకు పరిహారం వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

వర్షానికి రోడ్లు జలమయం :అనకాపల్లి జిల్లా చోడవరంలోని పలు కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. పెద్దేరు నది ఉద్ధృతికి 64 ఎకరాల్లో వరి పొలం నీటి మునిగింది. నర్సీపట్నం-చోడవరం మార్గంలో విజయరామరాజుపేట వద్ద డైవర్షన్ వంతెన కొట్టుకుపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అల్లూరి జిల్లా డొంక‌రాయి జ‌లాశ‌యానికి ఎగువ నుంచి వరద ఉద్ధృతంగా రావడంతో నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు. జోలాపూట్టు జలాశయం నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. నీటిని దిగువన ఉన్న డుడుమ జలాశయానికి విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద వస్తుండడంతో డుడుమ జలాశయం నాలుగు గేట్లు ఎత్తి బలిమెలకు విడుదల చేశారు.

ఉభయగోదావరి జిల్లాల్లో ఎడతెరపిలేని వర్షాలు - నీటమునిగిన పలు గ్రామాలు - Rains in joint Godavari District

పూర్తిస్థాయి నీటిమట్టానికి జలాశయాలు :ఉమ్మడి విజయనగరం జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు సాగునీటి ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టాన్ని చేరుకున్నాయి. వేగావతి, సువర్ణముఖి నదుల ద్వారా 13 వేల క్యూసెక్కుల నీరు మడ్డువలస జలాశయానికి చేరుతోంది. దీంతో ముందు జాగ్రత్తగా అధికారులు 8 గేట్లు ఎత్తి నాగావళి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. తాటిపూడి జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 297 అడుగులు కాగా ప్రస్తుతం 295.50 అడుగులకు చేరింది. రేగిడి మండలం సంకిలి బ్రిడ్జి వద్ద నాగావళి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సంతకవిటి మండలం రంగారాయపురం నారాయణ పురం ఆనకట్ట వద్ద 60 వేల క్యూసెక్కుల నీరు చేరుతోందని అధికారులు తెలిపారు.

ముంపు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధుల పర్యటన - బాధితులకు బాసటగా మంత్రులు, ఎమ్మెల్యేలు - Ministers visit on Flood areas

రాకపోకలకు ఆటంకం :ఉమ్మడి విజయనగరం జిల్లాలో పలు ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వేగావతి ఉద్ధృతికి బొబ్బిలి మండలం కొత్తపెంట వద్ద ఛానల్‌కి గండి పడింది. వరద నీరు రోడ్డుపైకి చేరి రాకపోకలు నిలిచిపోయాయి. బొబ్బిలి వద్ద పారది వంతెన కాజ్‌ వే దెబ్బతిని వాహనాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. గుర్ల మండలం జమ్ముపేట వద్ద ఆర్​ఓబీలో వరద నీటిలో ఆర్టీసీ బస్సు నిలిచిపోగా స్థానికులు, అధికారులు బయటకు తీశారు.

లోతట్టు ప్రాంతాలు జలమయం :విజయనగరంలోని మురుగు కాల్వలు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాయుడు కాలనీ, వినాయక నగర్‌లోని నివాసాలను వరద నీరు ముంచెత్తింది. గజపతినగరం మండలం మర్రివలస సమీపంలో చంపావతి నదికి వరద పోటు పెరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో 12 గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్రీకాకుళం జిల్లా లావేరి మండలం బెజ్జపురం, బుడతవలస మధ్య ప్రవహిస్తున్న వాగు నీటి ప్రవాహం పెరగడంతో ఓ మినీ వ్యాన్‌ కొట్టుకుపోయింది. హుటాహుటిన వెళ్లిన స్థానికులు డ్రైవర్‌ని కాపాడారు.

ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతు అప్డేట్ - ఇవాళ్టితో పూర్తికానున్న పనులు - Prakasam Barrage Gates Works

ABOUT THE AUTHOR

...view details