Govt Action on Perni Nani Godown: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నాని కుటుంబానికి చెందిన గిడ్డంగిలో రేషన్ బియ్యం మాయంపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. గోదాములోని రేషన్ బియ్యాన్ని మచిలీపట్నంలోని మార్కెట్ యార్డుకు తరలిస్తున్నారు. 8 లారీల్లో లోడ్ చేసి పంపిస్తున్నారు. పొట్లపాలెంలో పేర్ని నాని తన భార్య జయసుధ పేరుతో గోదాము నిర్మించి పౌరసరఫరాల శాఖకు లీజుకు ఇచ్చారు.
సదరు గోదాములో 185 టన్నుల రేషన్ బియ్యం మాయమవడంతో పేర్ని నాని సతీమణి జయసుధపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారులు సంబంధిత గోదాములోని మిగిలిన రేషన్ బియ్యం నిల్వలను మచిలీపట్నం మార్కెట్ యార్డుకు తరలిస్తున్నారు. స్టాక్ మొత్తం ఖాళీ చేశాక ఆ గోడౌన్ను బ్లాక్ లిస్టులో పెట్టనున్నారు.