Drinking water supply Project in Karimnagar :కరీంనగర్కు దిగువ మానేరు జలాశయం అందుబాటులో ఉండటంతో ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మిషన్ భగీరథ ద్వారా శుద్ధజలాన్ని అందించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. 4 వేల నివాసాలను లక్ష్యంగా నిర్ణయించుకున్న నగరపాలక సంస్థ, ఇప్పటికే 3వేల ఇళ్లకు పైగా మీటర్లను బిగించింది. కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా మాడ్రన్ హౌజింగ్ బోర్డు కాలనీకి ప్రయోగాత్మకంగా నిరంతర మంచినీరు సరఫరా చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
కరీంనగర్లో అందరికీ నిరంతర నీటి సరఫరా అందిచాలన్న ప్రణాళిక ఉన్నా 4 డివిజన్లలో ఎదురయ్యే లోటుపాట్లు పరిశీలించి మిగతా చోట్ల అమలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పైలెట్ ప్రాజెక్టులో ఇబ్బందులు తెలుసుకొని ఏజెన్సీ సిబ్బందికి అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారంలో ఒక్కొక్కరికి రోజుకు 160 లీటర్లు నీటి సరఫరా చేయాల్సి ఉంటుంది. అందుకు ఒక్కో ఇంటి నుంచి నీటి సరఫరా కోసం ఛార్జీలు వసూలు చేస్తున్నారు. నీటిని వృథా చేయకుండా వాడుకుంటే 100 రూపాయల కంటే ఛార్జీలు తగ్గే అవకాశం ఉందంటున్నారు.
'కరీంనగర్లో హౌజింగ్ బోర్డు పరిధిలో దాదాపు 4 డివిజన్లలో నాలుగు వేల గృహాలకు సంబంధించి 24 గంటలు మంచినీరు ఇచ్చే కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. రూ.18 కోట్లతో పనులు ప్రారంభించాం. పైప్లైన్ల పనులు పూర్తవుతున్నాయి. జులై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో 4 వేల గృహాలకు మంచి నీరు అందేలా ప్రణాళికలు తీసుకుంటున్నాం'- సునీల్రావు, కరీంనగర్ మేయర్