Elamasa Festival in Telangana : తెలంగాణలోని జుక్కల్ నియోజకవర్గం త్రిభాషా సంగమంగా పేరొందింది. మూడు రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలు కనిపించేది ఇక్కడే. ఈ ప్రాంత ప్రత్యేకతను చాటే ఓ పండగ రాష్ట్రంలోనే భిన్నంగా జరుపుకొంటారు. అదే ఎలమాస పండగ. ప్రతి ఏటా అమావాస్య రోజున (వార్షిక పండగ) జరుపుకొంటారు. అమావాస్య ఉండటంతో ఈ పర్వదినాన్ని ఎలమాస్య పండగ అంటుంటారు.
ఈ ప్రాంతంలో రబీలో అంతా ఆరు తడి పంటలే. చేలల్లో జొన్న మొక్కలతో కట్టిన గుడిలో అన్నీ మట్టి విగ్రహాలను తయారు చేస్తారు. అందులో లక్ష్మీదేవి, పాండవుల విగ్రహాలతో పాటు రైతులు, కాడెద్దులు, కాపలాదారుల మట్టి విగ్రహాలు ఆకర్షణీయంగా రూపొందిస్తారు. ఎలమాస పండగ జరుపుకొనే నాటికి లక్ష్మీదేవి గర్భవతిగా ఉన్నట్లు అన్నదాతలు భావిస్తారు. కడుపులో బిడ్డను మోస్తున్న లక్ష్మీదేవిని సంపూర్ణ ఆరోగ్యంగా చూసుకోవాలనే ఉద్దేశంతో సీమంతం తరహాలో అలంకరించి పూజలు నిర్వహిస్తారు.
జామ, చెరకు, రేగి పండ్లతో పాటు కంది, శనగ, తదితర గింజలను సమర్పిస్తారు. గుడికి కొంత దూరంలో మట్టి పాత్రలో పాలు పొంగించేందుకు మంట పెట్టి వస్తారు. ఆ తర్వాత రైతు కుటుంబమంతా బంధు, మిత్రులతో కలిసి చేనుకు వెళ్లేందుకు సిద్ధమవుతారు. మట్టి కుండలో అంబలి పోసి ఆ కుండకు మంగళసూత్రం లేదా ముత్యాలహారం కట్టడం సంప్రదాయంగా భావిస్తారు. తూర్పు దిశలో పాలు పొంగితే పంట సమృద్ధిగా పండుతుందని భావించి, పాలు పొంగిస్తారు.