Carpets Manufacturers Problmes in Eluru : అందమైన చేతితో అత్యంత నైపుణ్యంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దే మన్నికైన తివాచీలకు పెట్టింది పేరు ఏలూరు. నగరంలోని తంగెళ్లమూడి, లక్ష్మీవారపుపేట, శనివారపుపేట, ఆదివారపుపేట ప్రాంతాలు రంగురంగుల తివాచీ తయారీకి కేంద్రాలుగా ఉండేవి. కొన్ని వందల మగ్గాలపై ఇక్కడ నిత్యం తీరిక లేకుండా పనిసాగేది. దేశవిదేశాల నుంచి ఆర్డర్లపై వీటిని తయారు చేయించుకుని తీసుకువెళ్లేవారు. కొన్నేళ్ల క్రితం వరకూ ఈ ప్రాంతాలు తయారీదారులతో కళకళలాడేది.
Decreased Demand Eluru Carpets : ఏలూరు తివాచీలకు అంతటి గుర్తింపు రావడానికి కారణం మన్నిక, నాణ్యతే. స్వచ్ఛమైన ఉన్ని, జూట్, కాటన్ ముడిసరుకు ఉపయోగించి తయారు చేస్తారు. సహజమైన రంగులనే తివాచీలకు వాడుతారు. ఒక్కో పోగును ఓపిగ్గా ముడివేస్తూ వరుసకు 165 ముడులు వేసి ఎంతో పొందికగా వీటిని రూపొందిస్తారు. అయితే కాలక్రమంలో యంత్రాలపై చేసిన తివాచీలు మార్కెట్ను ముంచెత్తాయి. వీటిని అక్రిలిక్, ఫైబర్ లాంటి కృత్రిమ ముడిసరుకుతో తయారు చేయడంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దీనికి తోడూ ధర తక్కువగా ఉండటంతో వినియోగదారుల చూపు అటు మళ్లింది.
మూలకు పడిన యూనిట్లు : ఫలితంగా చేతితో తయారు చేసే తివాచీలకు ఆదరణ కరవైంది. దాంతో ఈ పరిశ్రమలో పనిచేసే వందలాది మంది ఇతర పనులకు వెళ్లిపోయారు. అయితే ఇప్పటికీ పలువురు మహిళలు దీనిపైనే ఆధారపడి బతుకుబండిని నెట్టుకొస్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో వందలాది మగ్గాలు పనిచేయగా ఇప్పుడు కేవలం 10 నుంచి 15 మాత్రమే పనిచేస్తున్నాయి. విదేశాలకు ఎగుమతులు లేక యూనిట్ల సంఖ్య మూలకు పడిపోయింది.