ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేవరగట్టు బన్నీ ఉత్సవంలో 70 మందికి గాయాలు - ఫలించని పోలీసుల వ్యూహం

దేవరగట్టు కర్రల సమరంలో చెలరేగిన హింస -70 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

By ETV Bharat Andhra Pradesh Team

Published : 6 hours ago

Devaragattu Bunny Festival 2024 in kurnool District
Devaragattu Bunny Festival 2024 in kurnool District (ETV Bharat)

Devaragattu Bunny Festival 2024 in kurnool District :పోలీసుల ముందస్తు చర్యలు ఫలించలేదు. అధికారుల ప్రణాళికలు ఫలితాలివ్వలేదు. దేవరగట్టు కర్రల సమరంలో హింస చెలరేగింది. కర్నూలు జిల్లాలో ఏటా దసరా రోజున అర్ధరాత్రి జరిగే బన్ని ఉత్సవంలో 70 మంది గాయపడ్డారు. కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో ఏటా విజయదశమి రోజు అర్ధరాత్రి జరిగే కర్రల సమరం ఈసారీ నెత్తురోడింది. దేవతామూర్తుల కోసం జరిగిన కర్రల సమరంలో 70 మంది గాయపడ్డారు. హింసకు తావులేకుండా ఈ బన్ని ఉత్సవాన్ని జరుపుకునేలా జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలు ఎలాంటి సత్ఫలితాలివ్వలేదు. ఎప్పటిలాగే హింస చెలరేగింది. రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో 70 మంది గాయాలపాలయ్యారు.

బన్నీ ఉత్సవం :దసరా సందర్భంగా కర్రల దేవరగట్టు ప్రజలు కర్రల సమరాన్ని తరతరాలుగా జరుపుకుంటూ వస్తున్నారు. ఏటా నిర్వహించే ఈ ఉత్సవం ఆనవాయితీగా వస్తోంది. ఆలూరు సమీపంలోని దేవరగట్టు వద్ద కొండపై వెలిసిన మాళమల్లేశ్వరస్వామి ఆలయం ఉంది. ఎప్పటిలాగే దేవతామూర్తులైన మాళమ్మ, మల్లేశ్వరస్వామికి దసరా పర్వదినాన అర్ధరాత్రి 12 గంటలకు కల్యాణం నిర్వహించారు. అనంతరం కొండ పరిసర ప్రాంతాల్లో పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం, ఎదురుబసవన్న గుడి మీదుగా దివిటీల వెలుతురులో విగ్రహాలను ఊరేగించారు. ఈ ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవడం కోసం 5 గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, మరో 3 గ్రామాల ప్రజలు ఇంకో వర్గంగా ఏర్పడి కర్రలతో సమరానికి దిగుతారు.

అర్ధరాత్రి దేవరగట్టు కర్రల సమరం - పోలీసుల పటిష్ఠ చర్యలు

కర్రల సమరంలో 70 మందికి గాయాలు :మాళమ్మ, మల్లేశ్వర స్వామివార్లు రాక్షస సంహారం చేసిన తర్వాత బన్ని ఉత్సవం నిర్వహిస్తారు. తమ ఇలవేల్పు దైవాన్ని స్వాధీనం చేసుకోవటం కోసం నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఓ జట్టుగా ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, అరికెర, నిడ్రవట్టి, బిలేహాల్‌ గ్రామాల ప్రజలు మరో జట్టుగా ఏర్పడి కర్రలతో తలపడ్డారు. ఇందులో ఇరువర్గాలవారు తీవ్రంగా గాయపడ్డారు. కర్రల సమరాన్ని చూడటానికి రాష్ట్రం నుంచే కాక కర్ణాటక నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. బన్ని ఉత్సవంలో హింసను నివారించేందుకు 800 మంది పోలీసులు మోహరించినా ఫలితం లేకుండా పోయింది. దేవగట్ట పరిసరాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘాను పటిష్ఠం చేసినా రక్తం చిందింది. గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

దేవరగట్టు ఉత్సవాలకు వెళ్తుండగా : కర్నూలు జిల్లా ఆలూరు మండలం కరిడిగుడ్డం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం దేవరగట్టులో బన్ని ఉత్సవాన్ని చూసేందుకు వెళ్తుండగా బైక్‌ అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. మృతులు కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన యువకుడిని ఆదోని ఆస్పత్రికి తరలించారు.

దేవరగట్టు సంబరం - కర్రల సమరానికి సిద్ధమైన గ్రామస్థులు

దేవరగట్టులో కర్రల సమరం - సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పటిష్ఠ నిఘా : ఎస్పీ బిందు మాధవ్

ABOUT THE AUTHOR

...view details