Corporate Gurukul Schools For Scheduled Caste Students :పెద్ద చదువులు చదివి డాక్టర్, ఇంజినీర్ కావాలనుకునే పేదింటి దళిత బిడ్డల కలలు సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన సాంఘిక సంక్షేమ గురుకులాలను కార్పొరేటు స్థాయికి తీసుకెళ్లేలా అడుగులు వేస్తోంది. ఐఐటీ (IIT), వైద్య విద్య, ఇతర జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఎస్సీ విద్యార్థులు ప్రవేశాలు పొందడమే లక్ష్యంగా ఈ ఏడాది నుంచే కార్పొరేటు విద్యా సంస్థలకు దీటుగా 7 ఐఐటీ-నీట్ కోచింగ్ అకాడమీలను అందుబాటులోకి తీసుకురానుంది.
ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎక్కువ మంది సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు జాతీయ స్థాయి ప్రవేశాల్లో అర్హత సాధించేలా శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే నైపుణ్యం కలిగిన అధ్యాపకులను ఎంపిక చేశారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే తరగతులు ప్రారంభించేలా సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా ఏడు ఐఐటీ-నీట్ కోచింగ్ అకాడమీలు :రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐఐటీ-నీట్ కోచింగ్ అకాడమీలను ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు సంబంధించిన 3 నీట్ -ఐఐటీ కోచింగ్ అకాడమీలున్నాయి. వీటిని కూడా 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అడవితక్కెళ్లపాడు(గుంటూరు), చిన్నటేకూరు(కర్నూలు), ఈడుపుగల్లు(విజయవాడ)లో నెలకొల్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో అదనంగా ఒక్క కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయలేదు.
తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడింటిని అందుబాటులోకి తీసుకువచ్చేలే చర్యలు చేపట్టింది. వీటిని విజయనగరం జిల్లా చీపురుపల్లి, తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం, అనంతపురం జిల్లాలోని బి.పప్పూరు, విశాఖపట్నంలోని శ్రీకృష్ణాపురం, ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ, పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల, చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఏర్పాటు చేయనుంది. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న గురుకులాల్లోనే ఈ అకాడమీలకు అదనపు వసతులు కల్పిస్తారు.