Chandrababu on P-4 Policy : ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం తోడైతేనే పేదరిక నిర్మూలన సాధ్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సమాజంలో అత్యున్నత శిఖరాలకు చేరిన 10 శాతం మంది ప్రజలు అట్టడుగున ఉన్న 20 శాతం మందికి చేయూతనిచ్చి పైకి తేవాలని పిలుపునిచ్చారు. పేదల జీవితాలు మార్చేందుకు ఉద్దేశించిన పీ-4 విధాన పత్రాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి ఇందులో అందరూ పాలుపంచుకునేలా సంక్రాంతి రోజు సంకల్పం తీసుకోవాలని కోరారు.
ఆర్థిక అసమానతలు తొలగిపోయి సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడే అందరి ఇళ్లలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ప్రతిపాదించిన పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్టనర్ షిప్-పీ-4 విధానంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పీ-4 విధానపత్రాన్ని ఎక్స్లో విడుదల చేసిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రజలకు రెండు పేజీల బహిరంగ లేఖ రాశారు.
ఆరోగ్య, ఆదాయ, ఆనంద ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. 1995లో తెచ్చిన పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్-పీ-3 విధానంతో ఉపాధి కల్పన, సంపద సృష్టి జరిగిందని గుర్తుచేశారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్లు సైతం నాటి అవకాశాలతో దేశ, విదేశాల్లో మంచి స్థానాల్లో ఉన్నారని తెలిపారు. అత్యధిక తలసరి ఆదాయం సాధించి తెలుగు ప్రజల సత్తా చాటుతున్నారని, నాటి సంస్కరణ ఫలాలు అన్ని వర్గాలకు చేర్చాల్సిన బాధ్యత ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
Chandrababu Tweet on P4 policy: రాష్ట్రంలో ఇప్పటికి లక్షల కుటుంబాలు పేదరికంలోనే ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. విద్య, వైద్యం, పౌష్టికాహారం, తాగునీరు వంటి కనీస అవసరాలు కూడా తీరని పరిస్థితిలో ఉన్నారని విచారం వెలిబుచ్చారు. ఎవరు ఎక్కడ స్థిరపడినా వారి మాతృ భూమిలో ఒక వ్యక్తికో, ఓ కుటుంబానికో, సమూహానికో, గ్రామానికో, ప్రాంతానికో చేయూత అందించి వారి జీవన ప్రమాణాలు పెంచవచ్చునని తెలిపారు. సమాజంలో లభించిన అవకాశాలను అందిపుచ్చుకుని అగ్రస్థానాల్లో ఉన్నవారు సమాజానికి తమవంతు తిరిగి ఇచ్చే ఆలోచనలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.