ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ డ్రగ్స్ కంటెయినర్​ కేసు - కన్పించని పురోగతి? - Visakhapatnam Drugs Container Case

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 30, 2024, 7:59 AM IST

Vizag Port Drugs Container Case : విశాఖలో భారీ మొత్తంలో కంటెయినర్​లో డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పురోగతి కన్పించడం లేదనే చర్చ సాగుతోంది. డ్రైడ్‌ ఈస్ట్‌ నమూనాలను సీబీఐ ప్రయోగశాలలకు పంపారు. అయినా ఇంతవరకూ నివేదికలు బయటకు రాలేదు. దీంతో ఈ కేసుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Visakhapatnam Drugs Container Case
Visakhapatnam Drugs Container Case (ETV Bharat)

Visakhapatnam Drugs Container Case Updates :సార్వత్రిక ఎన్నికల వేళ విశాఖ తీరంలో డ్రగ్స్‌ కంటెయినర్‌ కలకలం రేపిన విషయం తెలిసిందే. డ్రైడ్‌ ఈస్ట్‌ మాటున డ్రగ్స్‌ దిగుమతి కావడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈస్ట్‌ బ్యాగ్‌లలో ఎంతమేర డ్రగ్స్‌ కలిశాయో తెలుసుకోవడానికి అధికారులు నమూనాలు సేకరించారు. వాటిని సీబీఐకి చెందిన ప్రయోగశాలలకు పంపి నాలుగు నెలలవుతోంది. ఇప్పటికీ నివేదికలు బయటకు రాలేదు. దిల్లీ కేంద్రంగా సీబీఐ దర్యాప్తు చేస్తుండటంతో కేసులో పురోగతి ఏమిటనేది ప్రస్తుతం ఏపీలో చర్చ సాగుతోంది.

విశాఖకు చెందిన సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఆర్డర్‌ పెట్టగా బ్రెజిల్‌ నుంచి 25,000ల కిలోల ఇన్‌యాక్టివ్‌ డ్రైడ్‌ ఈస్ట్‌ ఈ సంవత్సరం మార్చి 16న పోర్టుకు చేరింది. దీనిపై ఇంటర్‌పోల్‌ సమాచారంతో ఆపరేషన్‌ గరుడ పేరుతో దిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు కంటెయినర్‌ను తెరిచి బ్యాగ్‌లను పరిశీలించారు. నిషేధిత మత్తు పదార్థాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆ తర్వాత బ్యాగ్‌లలో ఎంత శాతం డ్రగ్స్‌ కలిశాయో తెలుసుకునేందుకు నమూనాలు సేకరించి సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీకి పంపారు. ఈస్ట్‌ బ్యాగ్‌లను వేరే కంటెయినర్‌లోకి మార్చి సీల్‌ వేశారు.

CBI investigation Vizag Port Drugs Case :సాక్ష్యాల సేకరణ, దిగుమతిదారుల వాంగ్మూలం నమోదు తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు దిల్లీ వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆపరేషన్‌ గరుడ కేసును అక్కడి నుంచే దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ బృందం బ్రెజిల్‌ వెళ్లినట్లు సమాచారం. నగదు లావాదేవీలు, కస్టమ్స్‌ను తప్పించుకుని బ్రెజిల్‌ నుంచి నౌక ఎలా వచ్చింది? వంటివాటిపై ఆరా తీసి ఏం తేల్చారనేదీ బయటకు రాలేదు.

వీటీసీపీఎల్‌ ఎగ్జామిన్‌ పాయింట్‌లోనే :సీబీఐ సీజ్‌ చేసిన కంటెయినర్‌ విశాఖ కంటెయినర్‌ టెర్మినల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (వీటీసీపీఎల్‌) ఎగ్జామిన్‌ పాయింట్‌లోనే ఇంకా ఉంది. దీనికి కేంద్రం ఆధీనంలో ఉండే సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) భద్రత కల్పిస్తోంది. డైరెక్టర్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) సీజ్‌ చేసిన కంటెయినర్లు పది వరకు ఏడెనిమిదేళ్లుగా అక్కడే పడి ఉన్నాయి. డ్రగ్స్‌ అవశేషాలు ఉన్నట్లు భావిస్తున్న డ్రైడ్‌ ఈస్ట్‌ కంటెయినరూ అలాగే మరుగున పడిపోతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు డ్రగ్స్‌ రవాణాకు సంబంధించి సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌తోపాటు, పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. విశాఖను వదిలి వెళ్లకూడదంటూ ఆదేశాలు ఇచ్చింది. సంధ్యా ఆక్వా యాజమాన్యం, వైఎస్సార్సీపీ నాయకుల మధ్య సంబంధాలపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.

విశాఖ డ్రగ్స్ కంటైనర్ కేసు - కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు - Visakhapatnam Drugs Container Case

విశాఖ డ్రగ్స్‌ వ్యవహారంలో కూనం కోటయ్య కుటుంబం - వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు - Vizag Drugs Case YSRCP Relation

ABOUT THE AUTHOR

...view details