Budameru Victims Problems : బుడమేరు ఉప్పొంగడంతో విజయవాడలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. వాంబే కాలనీ వాసులు బయటకు వచ్చే మార్గం లేక రైలు పట్టాల మీదుగా నడుచుకుంటూ అవతలి వైపు ఉన్న అయోధ్యనగర్ కట్టకు చేరుకుంటున్నారు. చాలా మంది రబ్బరు ట్యూబ్లు తగిలించుకుని నీటిలో నడుచుకుంటూ వస్తున్నారు. దేవీనగర్ మెయిన్ రోడ్డుపై ఎన్నడూ లేని స్థాయిలో నడుము లోతు నీరు చేరింది. దీంతో పడవల ద్వారా రాకపోకలు సాగించాల్సి వచ్చింది.
రామకృష్ణాపురంలో రైలు పట్టాలు సమీపంలోని ప్రాంతమంతా నీట మునిగింది. బాధితులు ఇళ్ల నుంచి బయటకొచ్చి కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు తీసుకెళ్తున్నారు. కండ్రిగ, జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ, వాంబేకాలనీ, రాజీవ్నగర్ సోమవారం రాత్రికి కూడా ఏడు అడుగుల మేర నీటిలోనే ఉన్నాయి. రామవరప్పాడు రింగ్రోడ్డు సమీపంలోని ఓ డెయిరీ ఫాం నిర్వహిస్తున్న తండ్రీకుమారులు వెంకటేశ్వరరావు, సందీప్ వరద ధాటికి కొట్టుకుపోయి మరణించారు.
Vijayawada Floods Updates :న్యూ రాజరాజేశ్వరి పేట పూర్తిగా వరద గుప్పిట్లోనే ఉంది. అన్ని ప్రాంతాల కంటే ఇక్కడ తీవ్రత అధికంగా ఉంది. అక్కడకు పడవుల్లో వెళ్లేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం సాహసం చేయడం లేదు. దీంతో ఆ ప్రాంతాలోని ప్రజలు ఆహార, పానీయాలు అందడం లేదు. మిల్క్ ఫ్యాక్టరీ పూర్తిగా నీటిలోనే నానుతుంది. దీనికే సుమారు వంద కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. చిట్టినగర్ నుంచి వైఎస్సార్ కాలనీ వరకు నీళ్లలోనే ఉంది.
ఆహారం కోసం ఎగబడిన ప్రజలు :రెండు రోజులుగా వరద ముంచెత్తడంతో జనం బయటకు రాలేక దాహం, ఆకలితో తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రభుత్వం వరద బాధితులకు ఉప్మా, కిచిడీ, పాలు, రొట్టెలు, అన్నం, పెరుగన్నం, పులిహోర, మంచినీటి బాటిల్స్ అందించింది. స్వచ్ఛంద, ధార్మిక సంస్థలు సైతం పడవలపై సర్కార్ అందించిన ఆహారం, తాగునీరు కోసం ప్రధాన రోడ్లకు దగ్గరలో ఉన్న ముంపు బాధితులు ఎక్కువగా ఎగబడ్డారు.