BITS Campus in Amaravati :రాజధాని అమరావతి పనులు చకాచకా జరిగేలా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రతిష్ఠాత్మక సంస్థలు వరుస కడుతున్నాయి. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (BITS) క్యాంపస్ ఏర్పాటుకు సీఆర్డీఏ 35 ఎకరాలు కేటాయించనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో స్థలం కావాలని బిట్స్ కోరింది. తమ సంస్థ భవనాలనూ దేవాలయం నమూనాలో నిర్మిస్తామని ప్రతిపాదించింది. మరిన్ని యూనివర్సిటీలు, ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు రాజధానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కేంద్రప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వరంగ సంస్థల కార్యాలయాల ఏర్పాటుకూ రంగం సిద్ధమవుతోంది.
రాజధాని అమరావతిలో ఎస్ఆర్ఎం, విట్, అమృత వంటి విద్యాసంస్థలకు స్థలాలు కేటాయించిన నేలపాడు, ఐనవోలు ప్రాంతాల్లోనే బిట్స్కి స్థలం ఇవ్వాలని సీఆర్డీఏ భావించింది. అక్కడైతే 50 నుంచి 100 ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే కావాలని బిట్స్ కోరడంతో అక్కడైతే 35 ఎకరాలే ఇవ్వగలమని స్పష్టం చేసింది. ఎక్స్ఎల్ఆర్ఐ కూడా త్వరలోనే నిర్మాణాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఆ సంస్థకు ఐనవోలు వద్ద 2014-19లోనే సీఆర్డీఏ 50 ఎకరాలు కేటాయించింది. ఇప్పుడూ అదే స్థలాన్ని ఆ సంస్థకు ఇస్తారు. రాజధానిలో లా యూనివర్సిటీ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ముందుకొచ్చింది.
2014-2019 మధ్యలో రాజధానిలో దాదాపు 135 సంస్థలకు సీఆర్డీఏ స్థలాలు కేటాయించింది. వాటిలో పలు కేంద్ర సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు ఉన్నాయి. అప్పట్లో మూడేళ్లలోగా నిర్మాణాలు పూర్తిచేయాలన్న ఒప్పందం మేరకు స్థలాలు కేటాయించారు. గడువు ముగియడంతో ఆ కేటాయింపులన్నీ సాంకేతికంగా రద్దయ్యాయి. వాటిని పునరుద్ధరించే క్రమంలో మార్పులు చేయనున్నారు. గతంలో కేంద్రప్రభుత్వ సంస్థల కార్యాలయాలకు విడివిడిగా స్థలాలు కేటాయించగా, ఇప్పుడు వాటన్నింటినీ ఒకే భవనంలో ఏర్పాటుచేసేలా ప్రతిపాదిస్తున్నారు.
ఒకే ప్రాంగణంలో కేంద్ర కార్యాలయాలు :సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కి అప్పట్లో 28 ఎకరాలు కేటాయించారు. అవసరమైతే దాన్ని కొంచెం పెంచి సీపీడబ్ల్యూడీ ద్వారా భారీ కాంప్లెక్స్ నిర్మించి కేంద్రప్రభుత్వ సంస్థల కార్యాలయాలన్ని దానిలోనే ఏర్పాటు చేసేలా చూడాలని సీఆర్డీఏ భావిస్తోంది. కేంద్రప్రభుత్వరంగ సంస్థలనూ వీలైనంత వరకు ఒకే భవనంలోకి తీసుకొచ్చేలా, నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ద్వారా భవనం నిర్మించేలా ప్రతిపాదిస్తోంది.